Friday, March 29, 2024

నోటరీ భూముల క్రమబద్ధీకరణ గడువు పెంచిన సిఎం

- Advertisement -
- Advertisement -
వ్యవసాయ భూముల నోటరీ సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన

హైదరాబాద్: సికింద్రాబాద్, హైదరాబాద్‌లలో పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జివో 58,59 ప్రకారం నోటరీ భూముల క్రమబద్ధీకరణ గడువును మరో నెల రోజులు పొడిగించారు. సచివాలయ ప్రారంభోత్సవ సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ఎంఎల్‌ఏలు ముఖ్యమంత్రిని కలిసి జివో 58,59 గడువును పొడిగించాలని అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కెసిఆర్ గడువును నెల పాటు పొడిగించాలని నిర్ణయించారు.

అన్ని సమస్యలను ప్రభుత్వం చట్టం ద్వారా పరిష్కరిస్తుందని, చట్టబద్ధమైన హక్కులతో కూడిన టైటిల్‌ను అందజేస్తుందని ముఖ్యమంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు. పేదల ఇళ్ల సమస్యలను ఏక కాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ భూముల నోటరీ సమస్యలను పరిష్కరిస్తామని, త్వరలో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు ఎ.గాంధీ, ఎం.గోపీనాథ్, డి. నాగేంద్ర, ఎం. కృష్ణారావు, కె.సర్‌బందర్, ఎ.సాకు, మజ్లీస్ ఎంఎల్‌ఏ అక్బరుద్దీన్ ఓవైసీ తదితరులు ముఖ్యమంతిని కలిసి హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో పేదలకు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై చర్చించారు. పేద ప్రజలు వెంటనే తమ ఎంఎల్‌ఏలను కలవాలని, నోటరీ, ఇతర ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ చర్యతో, నిర్మాణంలో ఎటువంటి సమస్యలు లేకుండా పేద ప్రజలకు న్యాయమైన హక్కులు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

జివో 58,59 ప్రకారం నోటరీ భూముల క్రమబద్ధీకరణ గడువును మరో నెల రోజులు పొడిగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పేద ప్రజలకు భూమి, ఇళ్ల క్రమబద్ధీకరణ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News