హైదరాబాద్: చాలా విషయాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం మొక్కల పెంపకంలోనూ నెంబర్ వన్గా నిలిచిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మొక్కల పెంపకంలో తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని కేంద్ర అటవీ శాఖ గణాంకాలను వెల్లడించిందన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. మొక్కల పెంపకం, అటవీ పునరుజ్జీవనం, అటవీ రక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఆకుపచ్చ తెలంగాణ సాధన లక్ష్యానికి చేరువలో ఉన్నామని, అధికారులు, సిబ్బంది మరింత కష్టపడి ఆ దిశగా పని చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో అటవీ పునరుజ్జీవనంపై మరింత దృష్టిపెట్టనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.
కెసిఆర్ పుట్టిన రోజున మొక్కలు నాటుదాం
ఆకుపచ్చ తెలంగాణకై కృషి చేస్తోన్న ప్రకృతి ప్రేమికుడు సిఎం కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కను నాటి సంరంక్షించాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కోరారు. సిఎం ఆశయాలకు అనుగుణంగా ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని మొక్కను నాటి కానుకగా ఇద్దామన్నారు. సిఎం పుట్టిన రోజున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని టిఆర్ఎస్ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ పిలుపునివ్వడం ఆదర్శనీయమన్నారు.