మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణలో కొత్తగా మరో 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 41కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 333 మంది శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ ఆర్టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా,వారిలో ఎనిమిది మంది విదేశీ ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్కి పంపించారు. మరో 20 మంది ఫలితాలు రావాల్సి ఉంది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 26,947 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 140 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,80,553కి చేరింది. ఈ మేరకు శనివారం వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,021కు చేరింది. తాజాగా 186 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,499 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Telangana Report 3 new omicron cases