Saturday, May 4, 2024

పాక్ చెర నుంచి తెలుగు యువకుడు విడుదల.. ప్రేయసి కోసం వెళ్లి..

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్‌లో ఇరుక్కున్న తెలుగు యువకుడు విడుదల
ప్రేయసి కోసం దాయాది దేశంలో బంధీగా..

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రేయసి కోసం పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడి చెరసాలలో నాలుగేళ్ల పాటు శిక్ష అనుభవించిన ఎపిలోని విశాఖకు చెందిన ప్రశాంత్ కథ సుఖాంతమైంది. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రశాంత్ సోమవారం సురక్షితంగా కుటుంబం చెంతకు చేరారు. నాలుగేళ్ల శిక్ష పూర్తయినందున పాక్ అధికారులు భారత్‌కు అప్పగించగా సైబరాబాద్ సిపి సజ్జనార్ చొరవతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. స్వదేశానికి రప్పించేందుకు కృషిచేసిన తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు రుణపడి ఉంటానని ప్రశాంత్ తెలిపారు. వాఘా సరిహద్దులో పాక్ అధికారులు ఆ యువకుడిని భారత్‌కు అప్పగించారు. ప్రశాంత్ విడుదలతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాక్ నుంచి ప్రశాంత్ తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉందని అతని సోదరుడు శ్రీకాంత్ తెలిపాడు. ప్రశాంత్ తిరిగి వచ్చేందుకు నాలుగేళ్లుగా పోలీసుల కృషి ఎంతో ఉందని గుర్తుచేశాడు. ప్రశాంత్ తిరిగి వచ్చేందుకు మీడియా పాత్ర కూడా ఎంతో ఉందని తెలిపాడు.
ప్రేమ…ప్రేయసి:
ఎపిలోని విశాఖకు చెందిన ప్రశాంత్ సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన పాక్ యువతి ప్రేమ కోసం 2017లో స్విట్జర్లాండ్ వెళతానని ఇంట్లో చెప్పి దాయాది దేశానికి పయనమయ్యాడు.ఈక్రమంలో రాజస్థాన్ బికనీర్ వరకు రైలులో వెళ్లిన ప్రశాంత్ సరిహద్దుల్లోని ఫెన్సింగ్ దూకి పాక్ భూభాగంలో అడుగుపెట్టారు. వీసా, పాస్‌పోర్ట్ లేవనే కారణంతో ప్రశాంత్‌ను పాక్ సరిహద్దు బలగాలు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చినందుకు పంజాబ్ ప్రావిన్స్‌లో ప్రశాంత్‌ను పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఫెడరల్ దర్యాప్తు సంస్ధకు అప్పగించి విచారణ చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా పాక్ భూభాగంలోకి ప్రవేశించారనే కారణంపై సాఫ్ట్‌వేర్ ఇంజినీరైన ప్రశాంత్‌ను అరెస్టు చేసి నాలుగేళ్లుపాటు జైలు శిక్ష విధించారు.
తల్లడిల్లిన తల్లిదండ్రులు:
ప్రశాంత్ పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు తెలియడంతో తల్లిదండ్రులు తల్లిడిల్లారు. తమ కుమారుడిని కాపాడాలంటూ తెలంగాణ ప్రభుత్వం, సైబరాబాద్ సిపితో పాటు కేంద్రం దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. కుమారుడిని క్షేమంగా విడిపించేలా చర్యలు తీసుకోవాలని మొరపెట్టుకున్నారు. ప్రశాంత్‌ను హైదరాబాద్ తీసుకురావడంలో సైబరాబాద్ సిపి సజ్జనార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నాలుగేళ్లపాటు శిక్ష అనుభవించిన ప్రశాంత్ ఇటీవలే కారాగారం నుంచి విడుదలయ్యారు. పంజాబ్ ఫ్రావిన్సు సరిహద్దుల్లో భారత దౌత్యాధికారులకు అప్పగించగా…అక్కడి నుంచి మాదాపూర్ పొలీసులు క్షేమంగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
తిరిగి భారత్‌కు వస్తానని అనుకోలేదు:
పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న క్రమంలో తాను తిరిగి ఇండియాకు చేరుకుంటానని అనుకోలేదని ప్రశాంత్ మీడియాకు తెలిపాడు. తనను సురక్షితంగా ఇంటికి చేర్చిన తెలంగాణ ప్రభుత్వం, సిపి సజ్జనార్, కేంద్రానికి ప్రశాంత్ ధన్యవాదాలు తెలిపాడు. తనను సంరక్షించడంలో చొరవ చూపిన రెండు ప్రభుత్వాలకు రుణపడి ఉంటానని తెలిపాడు.
అమ్మ మాట విననందుకే అనర్థం:
తల్లిదండ్రుల మాటలు వినక మూర్ఖంగా ప్రవర్తించినందుకు నాలుగేళ్లు కుటుంబానికి దూరమయ్యానని ప్రశాంత్ ఉద్వేగానికి లోనయ్యాడు. తాను వెళ్లే ముందు తన అమ్మ ఆపేందుకు ప్రయత్నించిందని అమ్మ మాటను పెడచెవినపెట్టినందుకు కష్టాల పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు.అసలు తిరిగి వస్తానని అనుకోలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లే మళ్లీ తల్లిదండ్రులను చూడగలిగానని తెలిపాడు. నాలుగేళ్లలో హిందీ మాట్లాడటం నేర్చుకున్నట్లు వివరించాడు. అయితే తన సమస్యను భారత్-పాక్ మధ్య సమస్యగా చూడకూడదన్నాడు. రెండు దేశాల్లోనూ మంచివారు, చెడ్డవారు ఉన్నారని ప్రశాంత్ పేర్కొన్నాడు. జైలులో భారతీయులతో పని చేయించరన్నాడు. కారాగారంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పుస్తకాలు చదువుకున్నాని తెలిపాడు. భారతీయుల కోసం జైలులో ప్రత్యేక గదులు ఉండేవని ప్రశాంత్ వివరించాడు.

Telugu man released from Pakistan Jail

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News