Saturday, May 11, 2024

తెలంగాణలో ‘ఉగ్ర’ కదలికలు

- Advertisement -
- Advertisement -

రెండు జిల్లాల్లో ఎన్‌ఐఏ సోదాలు

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏకకాలంలో జాతీయ దర్యప్తు సంస్థకు చెందిన బలగాలు తనిఖీలు నిర్వహించాయి. రాష్ట్రంలోని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం ఉద యం ఎన్‌ఐఎ సోదాలు నిర్వహిం చింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) కదలికల నేపథ్యంలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. కరీంనగర్ హుస్సేన్‌పురలో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. నగరంలోని తబ్రేజ్ అనే వ్యక్తి ఇంట్లో గురువారం ఉదయం నుంచి ఎన్‌ఐఏ టీం సోదాలు చేపట్టింది. నిషేదిత పిఎఫ్‌ఐ సంస్థతో తబ్రేజ్ కు సంబంధాలు ఉన్నట్లు సమాచారం రావడంతో ఈ సోదాలు చేపట్టారు. గురువారం తెల్లవారు జామున 3-.30 గంటలకి తబ్రేజ్ ఇంటికి వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు దాదాపు ఐదు గంటల పాటు సోదాలు నిర్వహించారు. అయితే తబ్రేజ్ దుబాయ్ లో ఉంటున్నట్లు గుర్తించారు.

తబ్రేజ్ ఇంట్లో ఎన్‌ఐఏ కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడ ఎన్‌ఐఎఅధికారులు సోదాలు చేపట్టారు. తనిఖీలు కొనసాగుతున్న ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగా ణలోని కరీంనగర్‌తో పాటు ఏపిలోని కర్నూలులోనూ ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. కర్నూలు ఓల్డ్ సిటీకి చెందిన అబ్దుల్లా, మావియా ఇళ్లలో సోదాలు చేస్తోంది. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఎన్‌ఐఎ ప్రశ్నిస్తోంది. గతంలో కూడ పిఎఫ్‌ఐ కదలికలపై అనుమానాలతో ఎన్‌ఐఎ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు.
పిఎఫ్‌ఐ కార్యకలాపాలు వెలుగుచూసిందిలా!
2022 సెప్టెంబర్ 18న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 40 చోట్ల ఎన్‌ఐఎ అధికారులు సోదాలు చేపట్టారు. రెండు రాష్ట్రాల్లో నలుగురిని అరెస్ట్ చేశారు. తెలంగాణలోని నిజామాబాద్ లో పీఎఫ్‌ఐ కదలికలను స్థానిక పోలీసులు తొలుత గుర్తించారు. నిజామాబాద్ లో వ్యాయామ శిక్షణ పేరుతో నిర్వహిస్తున్న ట్రైనర్ ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహించిన సమయంలో పిఎఫ్‌ఐ కార్యకలాపాలు వెలుగు చూశాయి. దీంతో 2022 జూలై 4న నలుగురిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ సహదుల్లా, మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్ మోబీన్, అబ్దుల్ ఖదీర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కూడ పిఎఫ్‌ఐ కార్యకలాపాలు వెలుగు చూశాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు చోట్ల పలువురిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణలో పిఎఫ్‌ఐ కేసును స్థానిక పోలీసులు ఎన్‌ఐఎకి అప్పగించారు. ఈ కేసును ఎన్‌ఐఎ విచారిస్తుంది. నిజామాబాద్‌లో మహమ్మద్ పిఎఫ్‌ఐ వైపు యువతను ఆకర్షించేందుకు ప్రయత్నించినట్టుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఆత్మరక్షణ పేరుతో ట్రైనింగ్ నిర్వహిస్తూ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించినట్టుగా దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గతంలోనూ ఇదే తరహా దాడులు
గతంలో కూడా పిఎఫ్‌ఐ లింకులపై ఎన్‌ఐఏ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కుపాదం మోపింది. గతేడాది సెప్టెంబర్‌లో ఎన్‌ఐఎ భారీ ఎత్తున సోదాలు నిర్వహించింది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో దాడులు చేపట్టింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కేసులో నిందితులు, అనుమాతుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 చోట్ల, నిర్మాల్ జిల్లా భైంసాలోని మదీనా కాలనీలో, జగిత్యాలలోని టవర్ సర్కిల్‌లో ఉన్న కేర్ మెడికల్‌లో సోదాలు చేసింది. పాపులర్ ఫ్రంట్ కార్యకలాపాలపై ఆరాతీసింది. అదే సమయంలో కర్నూలు, కడప జిల్లాల్లో 23 బృందాలు సోదాలు నిర్వహించింది. గతంలో జరిగిన సోదాల సమయంలో డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్స్ రూ. 8.3లక్షల నగదును ఎన్‌ఐఎ స్వాధీనం చేసుకుంది. ఇక మళ్లీ మరోసారి తెలంగాణలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. ముఖ్యంగా కరీంనగర్‌లో పిఎఫ్‌ఐ కదలికలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఎన్నో నేరాలు.. ఘోరాలు
గతేడాది సెప్టెంబర్ 28న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను కేంద్రం నిషేధించింది. పిఎఫ్‌ఐ దాని అనుబంధ సంస్థలు చట్టవిరుద్ధమైన సంస్థలు అని కేంద్రం ప్రకటించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద పిఎఫ్‌ఐపై అయిదేళ్ల పాటు నిషేధం విధించింది. హత్యలు, దేశ రాజ్యాంగాన్ని విస్మరించడం, ప్రజాశాంతికి భంగం కలిగించడం లాంటి తీవ్రమైన నేరాలలో పిఎఫ్‌ఐ ఉన్నట్టు కేంద్రం చెప్పింది. దేశ సమగ్రత, భద్రత, సార్వభౌమత్వానికి విఘాతం కలిగిందని తెలిపింది. ఇక పిఎఫ్‌ఐ కార్యకర్తలు పదేపదే హింసాత్మక, విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నట్లు వివిధ కేసులు స్పష్టం చేస్తున్నాయి. ఓ కళాశాల ప్రొఫెసర్ అవయవాలను నరికివేయడం, ఇతర మతాలకు చెందిన సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులను హత్య చేయడం, ప్రముఖ వ్యక్తులను, ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడడం లాంటి ఎన్నో నేరాల్లో పిఎఫ్‌ఐ భాగస్వా మ్యం ఉండగా తెలంగాణలో పిఎఫ్‌ఐ కదలికలు ఎక్కువగా ఉన్నట్టు కూడా తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News