Sunday, April 28, 2024

గాండ్రింపులు గణనీయం

- Advertisement -
- Advertisement -

మైసూరు: దేశంలో పులుల సంఖ్య పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2018లో పులుల సంఖ్య 2,967గా ఉండగా, 2022 నాటికి ఆ సంఖ్య3,167కు పెరిగిందని చెప్పారు. ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం కర్నాటకలోని మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని ఈ గణాంకాలను విడుదల చేశారు. 2006లో 1,411 పు లులు ఉండగా, 2010లో 1,706, 2014లో 2,226, 2018లో 2,967 పులులు ఉండేవని తెలిపారు. 2006తో పో లిస్తే పులుల సంఖ్య 124.45 శాతం పెరిగిందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన అమృత కాలంలో పులుల సంఖ్య పెరుగుదలపై విజన్ డాక్యుమెంట్‌ను ఈ సందర్భంగా ప్రధాని వి డుదల చేశారు. రూ.50 స్మారక నాణేన్ని, భారత దేశంలో పులుల అభయారణ్యాల మదింపు నివేదికను కూడా మోడీ విడుదల చేశారు. చిరుతలు, సింహాలు, మంచు చిరుతలు, ప్యూమాలు, జాగ్వార్‌లు వంటి ఏడురకాల బిగ్ క్యాట్స్ సంరక్షణ కోసం అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయెన్స్‌ను మోడీ ప్రారంభించారు. ఈ కూటమిలో దాదాపు 97 దేశాలున్నాయి. వాతావరణ మార్పులతో సహా అనేక రకాల ముప్పుల వల్ల ఈ జంతువులు అంతరించి పోకుండా నిరోధించడంపై ఈ కూటమి దృష్టిపెడుతుంది.ఈ జంతువుల సంరక్షణకు ఆచరించదగ్గ చర్యలను నిర్ణయిస్తుంది. నిధులను కూడా సమకూరుస్తుంది.

పులుల అభయారణ్యాలు 2006లో 28 ఉండేవని, ఇప్పుడు వీటి సంఖ్య 51కి పెరిగిందని ప్రధాని తెలిపారు. మన దేశంలో పులుల సంరక్షణ కోసం పటిష్టమైన విధానాలను అమలు చేస్తున్నామని, అందువల్ల దేశవ్యాప్తంగా చిరుత పులుల సంఖ్య 63 శాతం పెరిగిందని చెప్పారు. 2014లో 7,910 చిరుత పులులు ఉండేవని, 2018 నాటికి వీటి సంఖ్య 12,852కు చేరుకుందని తెలిపారు. చీతాలు అంతరించిపోకుండా కాపాడడం కోసం 2022లో నమీబియా, దక్షిణాఫ్రికాలనుంచి చీతాలను మన దేశానికి తీసుకు వచ్చినట్లు చెప్పారు. విధంగా ట్రాన్స్‌కాంటినెంటల్ ట్రాన్స్‌లొకేషన్ జరగడం ప్రపంచంలోనే మొట్టమొదటిదని ఆయన చెప్పారు. ‘ ప్రాజెక్ట్ టైగర్ ’ విజయవంతం కావడం మన దేశానికే కాకుండా ప్రపంచానికే గర్వకారణమని మోడీ అన్నారు. ప్రపంచ భూభాగంలో భార దేశం వాటా 2.4 శాతమని ప్రధాని మోడీ గుర్తు చేశారు. కానీ ప్రపంచ జీవ వైవిధ్యంలో 8 శాతం వాటా మన దేశానిదేనని ఆయన అన్నారు. దాదాపు 30 వేల ఏనుగులతో ప్రపంచంలోనే అత్యధిక ఆసియా ఏనుగులు కలిగిన దేశంగా భారత్ నిలిచిందని అన్నారు. ప్రకృతిని సంరక్షించడం భారతీయ సంస్కృతిలో భాగమని చెప్పారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, ఆ శాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బండీపుర టైగర్ రిజర్వ్‌ను

సందర్శించిన ప్రధాని మోడీ

చామరాజనగర్:ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం కర్నాటకలోని బండీపుర టైగర్ రిజర్వ్‌ను సందర్శించారు. ఈ విషయాన్ని ప్రధాని వెల్లడిస్తూ టైగర్ రిజర్వ్‌కు చెందిన పలు ఫోటోలను ట్విట్టర్‌లో పంచుకున్నారు.‘ రమణీయమైన బండీపుర టైగర్ రిజర్వ్‌లో నేటి ఉదయం గడిపాను. భారత దేశ ప్రకృతి సౌందర్యాన్ని, వన్యప్రాణుల వైవిధ్యాన్ని ఆస్వాదించాను’ అని పేర్కొన్నారు. ఈ టైగర్ రిజర్వ్‌లో దాదాపు 20 కిలోమీటర్లు ప్రధాని పర్యటించారు. ఖాకీ ప్యాంట్, కామోప్లాజ్ టిషర్టు, స్లీవ్‌లెస్ జాకెట్ ధరించిన ప్రధాని ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. టైగర్ రిజర్వ్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా మోడీ నిలిచారు.

బొమ్మన్, బెల్లీ దంపతులతో ముచ్చట్లు

తెప్పక్కాడు ఎలిఫెంట్ క్యాంపు వద్ద ప్రధాని ఏనుగులకు చెరకు గెడలను కానుకగా ఇచ్చారు. ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న ‘ ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్, బెల్లీ దంపతులను, అందులో కనిపించిన ప్రతినిధులు, నిర్మాత దర్శకులు, మావటీలతో ముచ్చటించారు. మైసూరులోని కర్నాటక సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించే పులుల బండీపుర అభయారణ్యం టైగర్ ప్రాజెక్టు స్వర్ణోత్సవాలను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ శనివారం రాత్రే చెన్నైనుంచి మైసూరు చేరుకున్నారు.

పశ్చిమ కనుమల్లో తగ్గిన పులుల సంఖ్య

కాగా పులుల సంఖ్య శివాలిక్ హిల్స్ గంగానది మైదాన ప్రాంతాలు, మధ్య భారతం, సుందర్‌బన్స్ ప్రాంతాల్లో గణనీయంగా పెరగ్గా, పశ్చిమ కనుమలు, ఈశాన్య బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతాల్లో వీటి సంఖ్య తగ్గినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం విడుదల చేసిన నివేదికను బట్టి తెలుస్తోంది. అటవీ ప్రాంతం తగ్గిపోవడం,ముక్కలు కావడం, వేటగాళ్లు వేటాడడం లాంటి పలు అంశాలు ఈ ప్రాంతాల్లో పులుల సంఖ్య తగ్గడానికి కారణాలుగా నివేదిక పేర్కొంది. అలాగే ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లల౧ఓని కొత్త ప్రాంతాల్లో పులుల ఉనికికి సంబంధించిన ఫోటో సాక్షాలు కొత్త ప్రాంతాలకు వీటి రేంజి విస్తరిస్తోందని అర్థమవుతోందని ఆ నివేదిక పేర్కొంది. కాగా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పులుల సంరక్షణకు చిత్తశుద్ధితో తీసుకున్న చర్యలు వీటి సంఖ్య తిరిగి పెరగడానికి దోహదపడుతున్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News