మనతెలంగాణ, హైదరాబాద్: బాల్యం నుంచి చోరీలకు పాల్పడుతున్న దొంగను నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 37తులాల బంగారు ఆభరణాలు, 50తులాల వెండి వస్తువులు, రెండు మొబైల్ ఫోన్లు, సిపియూ, హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో 50 ఇళ్లల్లో చోరీలు చేశాడు. బషీర్బాగ్లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంతో సిపి అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా, పెద్దఊరా మండలం, చింతపల్లి తండాకు చెందిన జటావత్ మహేష్ చిన్నప్పడి నుంచి ఇళ్లల్లో చోరీలు చేస్తున్నాడు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మైనర్ కావడంతో గాజులరామారంలోని ప్రత్యేక హోంలో చేర్పించి చదివించారు. కొద్ది రోజుల తర్వాత మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ప్లంబింగ్, ఎలక్ట్రిషన్ పని నేర్చుకున్నాడు. అప్పడే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. తర్వాత ఐదు ఇళ్లల్లో చోరీలు చేశాడు. కంచన్బాగ్ పోలీసులు, ఈస్ట్జోన్ పోలీసులు ఇద్దరు కలిసి నిందితుడిని పట్టుకున్నారు.