దసరా తరువాత ప్రభుత్వం నుంచి ప్రకటన?
లక్షమంది రైతులకు ప్రయోజనం
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ భూములు, తెల్ల కాగితాలపై చేసుకున్న ఒప్పందాల (సాదాబైనామాల) క్రమబద్ధీకరణకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా, ఇదే చివరి అవకాశమని దీనిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు, ప్రభుత్వం సూచిస్తోంది. ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు మరోసారి సాదాబైనామాలకు అవకాశం ఇస్తామని అసెంబ్లీలో సిఎం కెసిఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై దసరా తరువాత ప్రభుత్వం ఆదేశాలను వెలువరించనున్నట్టుగా సమాచారం.
ప్రభుత్వం కల్పించే ఈ చివరి అవకాశం ద్వారా దాదాపుగా లక్షమంది రైతులకు ప్రయోజనం కలగనుంది. వాస్తవానికి 2014 డిసెంబర్లో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు జిఓ నంబర్ 58 (ఉచితంగా క్రమబద్ధీకరణ), జిఓ నంబర్ 59 (నామమాత్రపు విలువతో క్రమబద్ధీకరణ)లను ప్రభుత్వం జారీ చేసింది. అప్పట్లో వివాదాల్లేని భూములకు పట్టాలు ఇవ్వగా, దేవాదాయ, వక్ఫ్, చెరువు శిఖం, ఇతర ప్రభుత్వ శాఖల భూములకు చెందిన దరఖాస్తులను యంత్రాంగం పెండింగ్లో పెట్టింది. నామమాత్రపు విలువతో క్రమబద్ధీకరణ కోసం కొంతమంది రుసుములు చెల్లించినప్పటికీ కన్వేయన్స్ డీడ్ (యాజమాన్య బదిలీ) జరగలేదు. ఆయా దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం ఆన్లైన్లోనే ఉండటంతో ప్రభు త్వం ఇచ్చిన గడువు పూర్తి కాగానే వెబ్సైట్ను మూసివేశారు.
2016 జూన్లో 11,19,111 దరఖాస్తులు
2016 జూన్ 3వ తేదీన సిఎం కెసిఆర్ సాదాబైనామాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 11,19,111 మంది దరఖాస్తు చేసుకోగా 2,68,610 దరఖాస్తులకు ఆమోదం లభించింది. అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, అటవీ, రెవెన్యూ వివాదాలున్న భూములు 1/70 చట్టం పరిధిలోని భూములకు చెందిన 4,19,430 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. మరోసారి సాదాబైనామాలకు సిఎం కెసిఆర్ అవకాశం ఇవ్వాలని నిర్ణయించడంతో రైతులు, పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధరణి వెబ్సైట్ ప్రారంభం కాగానే సాదాబైనామాలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళుతున్నట్టుగా అధికారులు పేర్కొంటున్నారు.
2008లో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు జిఓ నంబర్ 166 కింద..
గతంలో జిఓ 58 కింద 3,46,181 దరఖాస్తులు వస్తే, 1,04,373 మందికి 71,93,685 గజాల స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరించారు. 2,41,808 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. నామమాత్రపు మార్కెట్ విలువతో భూముల క్రమబద్ధీకరణకు జిఓ నంబర్ 59 కింద 48,482 దరఖాస్తులు రాగా కేవలం 14,188 దరఖాస్తుల పరిశీలనకే ఆమోదం లభించింది. జిఓ నంబర్ 92 కింద మిగులు భూముల (పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం) క్రమబద్ధీకరణకు 7,867 దరఖాస్తులు రాగా 700 దరఖాస్తులకే ఆమోదం లభించింది. 2008లో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు జిఓ నంబర్ 166 కింద హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన 2,583 దరఖాస్తులను ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు తీర్పు పెండింగ్లో పెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ దరఖాస్తుల క్లియరెన్స్ హైకోర్టు అనుమతిని వ్వడంతో ఆ అనుమతుల ఆధారంగా వీటిని జిఓ నంబర్ 59లో పేర్కొన్న విలువ ఆధారంగా క్రమబద్ధీకరించడానికి అవకాశం ఇస్తూ జిఓ నంబర్ 179 జారీ చేశారు.
ఆర్ఒఆర్ చట్టం వచ్చే దాకా…
1971 రికార్డ్ ఆఫ్ రైట్ చట్టం తేవడానికి ముందు తెలంగాణలో భూముల లావాదేవీలన్నీ సాదా బైనామాల (తెల్లకాగితాలపై) మీదే జరిగేవి. 1947లో నిజాం కాలంలో తెచ్చిన ఆర్ఒఆర్ చట్టంలోనైతే సాదా బైనామాలపై జరిగే లావాదేవీలను వ్యవసాయ సంవత్సరం లెక్కలు రాసే క్రమంలో రికార్డుల్లో రాయాలన్న నిబంధన ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత 1971లో తెచ్చిన ఆర్వోఆర్ చట్టం మేరకు చట్టబద్ధత కలిగిన డాక్యుమెంట్ (రిజిస్టర్ అయిన)నే రికార్డుల్లో చేర్చాలన్న క్లాజును చేర్చారు. సాదా బైనామాల లావాదేవీలు ఉమ్మడి రాష్ట్రంలో జరగ్గా గ్రామ సభల్లో వచ్చిన విజ్ఞప్తుల మేరకు నామమాత్రపు విలువతో కొన్ని చోట్ల క్రమబద్ధీకరించారు.