ఒక టిఎంసి ఎంపి, మరో 9 మంది ఎమ్మెల్యేలు కూడా
మిడ్నాపూర్(ప.బెంగాల్): పశ్చిమ బెంగాల్ రాజకీయ దిగ్గజం సువేందు అధికారి మరో తొమ్మిది మంది వేర్వేరు పార్టీలకు చెందిన శాసనసభ్యులు, ఒక టిఎంసి ఎంపితో కలసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం నిర్వహించిన బిజెపి ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ఆయన టిఎంసిని వీడి బిజెపిలో చేరతారని గత కొంత కాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది.
కొద్ది రోజుల క్రితం మమతా బెనర్జీ మంత్రివర్గానికి రాజీనామా చేసిన సువేందు అధికారి గత వారం తన శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేయగా దాన్ని స్పీకర్ ఇంకా ఆమోదించలేదు.
కాగా..గత కొంతకాలంగా టిఎంసి నాయకత్వంపై అసమ్మతి గళం వినిపిస్తున్న టిఎంసి లోక్సభ సభ్యుడు సునీల్ మోండల్ కూడా శనివారం అధికారితోపాటు బిజెపిలో చేరారు. వీరితోపాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు బిజెపిలో చేరారు. ముగ్గురు సిపిఎం ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా నేడు అమిత్షా సమక్షంలో బిజెపిలో చేరారు. టిఎంసికి, వామపక్షాలు,కాంగ్రెస్కు చెందిన పలువురు జిల్లా స్థాయి నాయకులతోపాటు మాజీ మంత్రి శ్యామప్రసాద్ ముఖర్జీ కూడా నేడు బిజెపిలో చేరారు.