టోక్యో: ఒలింపిక్స్లో భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పి.వి.సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఎలాగైనా పతకం సాధించాలనే పట్టుదలతో ఒలింపిక్స్ బరిలోకి దిగిన సింధు అంచనాలకు తగినట్టు ఆడుతూ ముందుకు సాగుతోంది. డెన్మార్క్ క్రీడాకారిణి మియా బ్లింక్ ఫెట్ట్తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు అలవోక విజయాన్ని అందుకుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి సింధు 21-15, 21-13 తేడాతో వరల్డ్ 12వ ర్యాంక్ షట్లర్ బ్లింక్ఫెల్ట్ను చిత్తు చేసింది. అసాధారణ ఆటతో చెలరేగి పోయిన సింధు 40 నిమిషాల్లోనే మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఆరంభం నుంచే తన మార్క్ షాట్లతో ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేసింది. సింధు ధాటికి బ్లింక్ ఫెల్ట్ తీవ్ర ఒత్తిడికి గురైంది.
ఈ క్రమంలో వరు తప్పిదాలకు పాల్పడింది. ప్రత్యర్థి బలహీనతలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన సింధు సునాయాసంగా మొదటి గేమ్ను దక్కించుకుంది. తర్వాతి గేమ్లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగింది. ఇక బ్లింక్ ఫెల్ట్ ఏ దశలోనూ పుంజుకోలేక పోయింది. కనీస ప్రతిఘటన కూడా ఇవ్వకుండానే మ్యాచ్ను సింధుకు సమర్పించుకుంది. ఇక చెలరేగి ఆడిన సింధు వరుసగా రెండు సెట్లు గెలిచి క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. కిందటి ఒలింపిక్స్లో రజతం సాధించిన సింధు ఈసారి స్వర్ణం గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్కు చేరి పతకం ఆశలను మరింత పెంచుకుంది.
Tokyo Olympics: PV Sindhu reaches quarter finals