Monday, April 29, 2024

నగరంలో ట్రాఫిక్ జాం…

- Advertisement -
- Advertisement -

traffic jam in hyderabad begumpet

బేగంపేట, హెచ్‌ఐసిసి వద్ద నరకం చూసిన వాహనదారులు
బిజేపి జాతీయ సమావేశాలు, పలువురు వివిఐపిల రాక
ఆంక్షలు విధించిన హైదరాబాద్ పోలీసులు
గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు

హైదరాబాద్: నగరానికి పలువురు విఐపిలు రావడంతో ఎక్కడికక్కడా ట్రాఫిక్ జాం ఏర్పడింది. బిజేపి జాతీయ సమావేశాలు రెండు రోజుల పాటు గచ్చిబౌలిలోని హెచ్‌ఐసిసిలో జరగనున్నాయి. ఈ సమావేశాలకు దేశ ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులు, బిజేపి పాలిత రాష్ట్రాల ముఖ్యంత్రులు రావడంతో పోలీసులు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడడంతో వాహనదారులు నరకం చూశారు. గంటల కొద్ది వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో ఇబ్బందులు పడ్డారు. బేగంపేటకు ప్రధాని నరేంద్రమోదీ రావడంతో పోలీసులు బేగంపేట నుంచి రాజ్‌భవన్ వరకు ఆంక్షలు విధించారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ బేగంపేట విమానాశ్రయంలో దిగారు. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నగరంలోని పర్యటనకు రావడంతో పలు ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.

బేగంపేట విమానాశ్రయానికి పలువురు విఐపిలు ఒక్కరోజే రావడంతో నగర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాహనాలతో బయలుదేరిన వారు గంటల తరబడి అందులోనే ఉండాల్సి వచ్చింది. అలాగే హెచ్‌ఐసిసిలో నిర్వహిస్తున్న బిజేపి జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తుండడంతో పలువురు ఆ పార్టీ నాయకులు వచ్చారు. దీంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దేశ ప్రధాని సమావేశాల్లో పాల్గొననుండడంతో పోలీసులు 3,000మందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చాలా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. దీంతో పలు ప్రాంతాల్లో వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. వాహనాలను మళ్లించడంతో అన్ని ఒకవైపుకు రావడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

బేగంపేటకు వివిఐపిల తాకిడి….

బేగంపేట విమానాశ్రయానికి శనివారం వివిఐపిల తాకిడి ఎక్కువగ ఉంది. పలువురు విఐపిలు బిజేపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రావడంతో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. వివిఐపిలు ప్రత్యేక విమానాల్లో బేగంపేట ఎయిర్‌పోర్టు రానుండడంతో వారికి స్వాగతం పలికేందుకు పలువురు రావడంతో ఆ ప్రాంతం మొత్తం పోలీసుల గుప్పిట్లోకి వెళ్లింది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో పోలీసులు వాహనాలపై పలు ఆంక్షలు విధించారు. దీంతో బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి వెళ్లే వారు చాలా ఇబ్బందులు పడ్డారు.

హెచ్‌ఐసిసిని ముట్టడించేందుకు కాంగ్రెస్ యత్నం…
బిజేపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న హెచ్‌ఐసిసి, నోవాటెల్‌ను ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యత్నించడంతో కొద్ది సేపు ఉద్రికత్తత నెలకొంది. తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కేంద్రమంత్రి అమిత్‌షా వచ్చే సమయంలో అడ్డుకోవడానికి యూత్ కాంగ్రెస్ సన్నాహాలు చేసింది. ముందుగానే గుర్తించిన పోలీసులు నోవాటెల్ పరిసరాల్లో ఉన్న యూత్ కాంగ్రెస్ నాయకులను మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News