హైదరాబాద్: అన్నం పెట్టే రైతన్నకు ఎలాంటి కష్టం రాకుండా సీఎం కెసిఆర్ వ్యవసాయ రంగంలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. బిజెపి నేతలు చేస్తున్న అసత్య అరోపణలపై మంగళవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా లభ్ది పోందాలనే దురుద్దేశ్యంతో రైతు బీమాపై బిజెపి నేతలు అసత్య అరోపణలు చేస్తున్నారన్నారు. రైతులు అకాల మరణం చెందితే ఆ కుటుంబం ఇబ్బందులు పడకుండా అసరాగా నిలిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు బీమా పథకాన్ని సీఎం కెసిఆర్ అమలు చేస్తున్నారన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంతుంటే ఓర్వలేక బిజెపి నేతలు కుట్రలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో రైతులకు చేయని మేలు సీఎం కెసిఆర్ నాయకత్వంలో జరుగుతుంటే మతతత్వ పార్టీ జీర్ణించుకోలేక పోతుందని ఘాటుగా విమర్శించారు. రైతులకు నిజంగా రైతు బీమా ఇవ్వడం లేదని టిఆర్ఎస్ ప్రభుత్వంపై అజ్ఞానుల్లా బిజేపి నేతలు చేసే ఆరోపణలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలపై ప్రతిపక్షాలు ముందు లోతుగా అధ్యయనం చేసి మాట్లాడాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 102 నియోజకవర్గాల్లో ప్రభుత్వం రైతు బీమా పథకం ఎంత మందికి ఇస్తుందో వివరాలను తెలియజేశారు. 2018-19లో 17641మంది మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.882.05 కోట్లు, 2019-20లో 18,912మంది మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ.945.6 కోట్లు, 2020-21 లో 27701 మంది మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.1385.05 కోట్లు, 2021-22లో 3766మంది మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.188.3కోట్లు, మొత్తం 68,020 కుటుంబాలకు రూ.3401.00కోట్ల రైతు బీమా ఇచ్చిన ఏకైక పార్టీ టిఆర్ఎస్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 33మంది మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.1.65 కోట్లు ప్రభుత్వం రైతు బీమా ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ ప్రవేశపెడుతున్న పథకాలను విపక్షాలు ఇప్పటికైనా కళ్ళు తెరచుకొని విమర్శలు, అబద్దపు ప్రచారాలు మానుకోవాలన్నారు.
TRS MLA Vivekananda Fires on BJP