హైదరాబాద్ : న్యాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పిజిఎల్సెట్ నోటిఫికేషన్ మార్చి 2వ తేదీన విడుదల కానుంది. శనివారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించినలాసెట్, పిజిఎల్సెట్ కమిటీ సమావేశంలో షెడ్యూల్ను నిర్ణయించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్లు ఆర్.లింబాద్రి, వి.వెంకటరమణ, కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు, ఒయు రిజిస్ట్రార్ సిహెచ్ గోపాల్రెడ్డి, లాసెట్ కన్వీనర్ జి.బి.రెడ్డి, లైసన్ ఆఫీసర్ పి.రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. లాసెట్, పిజిఎల్సెట్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 20 వరకు, రూ.వెయ్యి ఏప్రిల్ 30 వరకు, రూ.2 వేల అపరాధ రుసుంతో మే 10 వరకు, రూ.4 వేల అపరాధ రుసుంతో మే 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులలో దొర్లిన తప్పుల సవరణకు మే 11 నుంచి 16 వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు మే 21 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 27వ తేదీన ఆన్లైన్ విధానంలో లాసెట్, పిజిఎల్సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మే 31వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేసి, జూన్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూన్ 10వ తేదీన ఫైనల్ కీతో పాటు లాసెట్ ఫలితాలు విడుదల చేస్తారు.