Friday, April 26, 2024

‘డ్రగ్స్’ మాఫియాపై మరింత నిఘా

- Advertisement -
- Advertisement -

TS Police More focus on Drug mafia

చెక్‌పోస్ట్‌లలో పోలీస్,ఎక్సైజ్ తనికీలు

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక ఆదేశాల మేరకు రాష్ట్ర సరిహద్దులలోని చెక్‌పోస్టులలో ఎక్సైజ్, పోలీసులు సంయుక్తంగా డ్రగ్స్‌పై నిఘా సారించనున్నారు. ఇటీవల కాలంలో డ్రగ్స్ కేసులలో పట్టుబడిన నిందితులు, వారి నుంచి క్రయవిక్రయాలు సాగించిన వారి జాబితాను రూపొందిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న అంతర్జాతీయ మత్తు ముఠాల కోసం ప్రత్యేక బృందాలు ఆరా తీయడంతో పాటు నగరంలో ఉంటున్న నైజీరియన్లతో పరిచయమున్న విక్రయదారులు, కొనుగోలుదారుల జాబితాను పోలీసులు సిద్ధం చేశారు. డ్రగ్స్ విక్రయించేవారితో పాటు కొనుగోలు చేసే వారికి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈక్రమంలో గోవా, ముంబయి, బెంగళూరు నుంచి డ్రగ్స్ నగరానికి వస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వివిధ సంఘటనలతో పాకిస్థాన్ నుంచి కూడా మత్తు పదార్థాలు హైదరాబాద్‌కు చేరుతున్నట్లు గుర్తించారు. ఇటీవల ఢిల్లీ ఎన్‌సిబి అధికారులు డ్రగ్స్ కేసులో 22 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

వీరిలో నగరానికి చెందిన సైక్రియాటిస్ట్ ఆదిత్యరెడ్డి ఉన్నట్లు తేల్చారు. ఇతని వద్ద మత్తు పదార్థాలు కొనుగోలు చేసిన వినియోగదారులు, ముఠాల గురించి వివరాలు సేకరిస్తున్నారు. నిద్ర, నొప్పుల ఉపశమనం కోసం ఉపయోగించే మాత్రలను కొందరు అధికధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నగరంలోని జీడిమెట్ల, బాలానగర్, కొంపల్లి తదితర ప్రాంతాల్లో పోలీసులు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్, సికిందరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో మూతపడిన, నష్టాల్లో ఉన్న పరిశ్రమల్లో మాదకద్రవ్యాల ముడిసరుకు ఎపిడ్రిన్, మెఫిడ్రిన్ తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడిన విషయం విదితమే. ఇక్కడ తయారయ్యే డ్రగ్స్‌కు సంబంధించిన ముడిసరుకు ఫార్మా ఉత్పత్తులంటూ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రకు చేరవేస్తున్నారు. అక్కడ నుంచి విదేశాలకు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు సేకరించిన సమాచారం మేరకు ప్రభుత్వం డ్రగ్స్ కట్టడికి పటిష్ఠం చర్యల్లో భాగంగా మూతపడిన పరిశ్రమలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

అమ్మినా, కొన్న చర్యలు 
కరోనా సమయంలో కొంత మంది విద్యార్థులు గంజాయికి అలవాటు పడ్డారని, కాలక్రమంలో డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోందని, డ్రగ్స్ విక్రయించినా, కొనుగోలు చేసినవారిపై చర్యలు తీసుకుంటున్నామని పోలీసు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. అటవీ ప్రాంతల నుండి గంజాయిని గ్రామీణ ప్రాంతాలకు సైతం తరలిస్తున్నారని విచారణలో తేలిందని, కొంతమంది అబ్బాయిలతో పాటు కొంతమంది అమ్మాయిలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారని, ఇంటర్ నేషనల్ స్కూల్ వద్ద బయట కొంత మంది డ్రగ్స్ విక్రయిస్తున్నారని పేర్కొంటున్నారు. విద్యార్థుల పట్ల వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ విషయంలో సిఎం కెసిఆర్ స్వయానా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి వెయ్యి మంది పోలీసులతో నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్వెస్టిగేషన్ వింగ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇకపై మాదక ద్రవ్యాలు అమ్మిన కొన్న కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News