Saturday, May 4, 2024

గ్రామీణ ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు టిఎస్ ఆర్టీసి కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -
పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్‌లు అమల్లోకి….
10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800లు
5 కిలోమీటర్ల పరిధికి రూ.500లుగా చార్జీలు
నేటి నుంచి అమల్లోకి పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్‌లు

హైదరాబాద్ : గ్రామీణ ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు టిఎస్ ఆర్టీసి కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్‌లకు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ -పాస్‌ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ -టౌన్ పాస్‌తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్ నగర్‌లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800లు, 5 కిలోమీటర్ల పరిధికి రూ. 500లుగా పల్లె వెలుగు టౌన్ బస్‌పాస్ ధరను ఆర్టీసి ఖరారు చేసింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ నగరాల్లో జనరల్ బస్‌పాస్ అందుబాటులో ఉంది. ఈ-బస్ పాస్‌ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా ఈ పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్‌ను సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది.
నేటి నుంచి అందుబాటులోకి..
హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో సోమవారం పల్లె వెలుగు టౌన్ బస్‌పాస్ పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ కొత్త టౌన్‌పాస్‌ను ఈ నెల 18వ తేదీ (మంగళవారం) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.
సంస్థను ప్రోత్సహించాలి : ఎండి విసి సజ్జనార్
జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు పల్లెవెలుగు టౌన్ బస్ పాస్‌ను టిఎస్ ఆర్టీసి యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఈ పాస్‌ను అమలు చేస్తున్నామని ఎండి సజ్జనార్ తెలిపారు. ప్రయాణికుల ఫీడ్ బ్యాక్‌ను బట్టి మరిన్ని ప్రాంతాలకు పల్లె వెలుగు టౌన్ బస్ పాస్‌లను విస్తరిస్తామన్నారు. వాస్తవానికి 10 కిలోమీటర్ల పరిధికి రూ.1200లు, 5 కిలోమీటర్ల పరిధికి రూ.800లు ధర ఉండగా ప్రయాణి కులకు ఆర్థిక భారం తగ్గించాలని ఆ బస్‌పాస్‌లకు సంస్థ రాయితీ కల్పించిందన్నారు. కొత్తగా తీసుకువచ్చిన ఈ-పాస్‌ను హైదరాబాద్, వరంగల్ లో మాదిరిగానే ప్రయాణికులు ఆదరించి సంస్థను ప్రోత్సహించాలని ఎండి కోరారు.

ఈ-బస్‌పాస్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు టిఎస్ ఆర్టీసి కాల్ సెంటర్ నెంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఓఓ డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వినోద్‌కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News