Friday, May 3, 2024

పది ఫలితాలలో బాలికలదే హవా…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.కృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గత నెల 3 నుంచి 13 వరకు జరిగిన పరీక్షలకు 2 లక్షల 49 వేల 747 బాలురు.. 2, 44, 873 మంది బాలికలు కలిపి మొత్తం 4, 94, 620 మంది విద్యార్థులు హాజరయ్యారు.
86.60 శాతం ఉత్తీర్ణత నమోదు ః
పదో తరగతి ఫలితాల్లో 86.60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. టెన్త్ ఫలితాల్లో బాలికలు 88.53 శాతం, బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మొత్తం 4 లక్షల 91 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 4 లక్షల 19 వేల మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి పేర్కొన్నారు. 2,793 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఒక్క విద్యార్థి పాస్ కాని పాఠశాలలు 25 ఉన్నాయని మంత్రి సబిత స్పష్టం చేశారు.
నిర్మల్ ఫస్ట్.. వికారాబాద్ లాస్ట్ ః
పది ఫలితాల్లో 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా అగ్రస్థానంలో నిలవగా.. 59.46 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 7,492 మంది విద్యార్థులు ప్రైవేటుగా పరీక్షలు రాయగా.. వారిలో 44.51 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. జూన్ 14 నుంచి 22 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలుంటాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 26 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు ఉందని అన్నారు.
విద్యార్థులు దైర్యంగా ఉండాలి ః రెండు రోజులకితం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో పలువురు విద్యార్థులు ఫెయిలైనందున ఆత్మహత్యం చేసుకోవడం సరికాదని, మనోదైర్యంగా ఉండాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. అదే విధంగా తల్లిదండ్రులు పిల్లల మానసిక స్ధితిని గుర్తించి వారికి దైర్యం చెప్పాలని, లక్షలు ఖర్చు చేశామని బెదిరింపులు చేయవద్దన్నారు. ఈఫలితాల్లో ఫెయిల్ అయిన సప్లిమెంటరీ పరీక్షలు రాసి తోటి విద్యార్థుల వెంట కళాశాలకు వెళ్లవచ్చన్నారు. పదతరగతి విద్యార్థులకు కూడా ఫెయిలైనందుకు ఇబ్బంది పడాల్సిన అవసరంలేదని, వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, అందులో అందరు ఉత్తీర్ణత సాధిస్తారని, అప్పటివరకు చదుకోవాలని సూచించారు.
తెలంగాణ గురుకుల పాఠశాలలు 98.25 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత శాతం పొందాయి. ప్రభత్వ పాఠశాలలు 72.39శాతంతో అత్యల్ప ఉత్తీర్ణత శాతం సాధించాయి. టిఎస్ రెసిడెన్షియల్, సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్, బిసి వెల్పేర్, మైనార్టీ రెసిడెన్షియల్, ట్రైబల్ రెసిడెన్షియల్ , మోడల్ స్కూల్స్, ప్రైవేటు పాఠశాలలు సరాసరి ఉత్తీర్ణత శాతంకంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News