Monday, April 29, 2024

దేశంలోనే అత్యున్నత పోలీస్ శాఖగా తెలంగాణ పోలీస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర పోలీస్ శాఖ ఆధునీకరణకు, పోలీస్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, ప్రాధాన్యత దేశంలోని మరే రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు చేయలేదని రాష్ట్రం హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పలు సేవా పతకాల ప్రదానం 281 మంది పోలీస్ అధికారులకు బుధవారం నాడు రవీంద్ర భారతిలో జరిగింది. ఈ పతకాల పంపిణి కార్యక్రమానికి రాష్ట్ర హోం శాఖా మంత్రి మహమూద్ అలీ, డిజిపి అంజనీ కుమార్‌లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సక్రమంగా జరిగి రాష్ట్రం పురోభివృద్ధిలో పయనిస్తున్నదని అన్నారు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీస్ శాఖ ఆధునీకరణ, పెద్ద ఎత్తున నియామకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. ఇటీవల ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనరేట్ లాంటి భవనం మరెక్కడా లేదని ప్రస్తావించారు. కొత్త పోలీస్ జోన్లు ఏర్పాటు చేయడం, పోలీస్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లు కొత్తగా ఏర్పాటుతోపాటు నార్కోటిక్స్ కంట్రోల్ విభాగం, ఐ 4 సి లను కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్ కంట్రోల్ టవర్‌ను కూడా ప్రారంభించు కున్నామని తెలిపారు. రాష్ట్రంలో మెరుగైన శాంతియుత పరిస్థితులు ఉన్నందునే, అనేక బహుళ జాతి సంస్థలు తమ కార్యకలాపాలను హైదరా బాద్ లో ప్రారంభించాయని అన్నారు. ఫ్రెండ్లి పోలీసింగ్, మహిళా భద్రతా విభాగం, షీ టీమ్స్ , భరోసా కేంద్రాలు, సీసీ టీవీ ల ఏర్పాటు, మట్కా-గ్యాంబ్లిగ్ కేంద్రాల మూసివేత, మాదక ద్రవ్యాల నివారణ తదితర చర్యలతో తెలంగాణా పోలీస్ దేశంలోనే అత్యున్నత పోలీస్ శాఖగా నిలిచిందని హోం మంత్రి తెలియచేసారు.

డిజిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ, ఈ పతకాలు కేవలం వ్యక్తిగతం కావని, తమ పరిధిలో పనిచే వారందరితోపాటు, కుటుంబ సభ్యులకు వచ్చినట్టుగా బావించాలన్నారు. పోలీస్ శాఖ ఆర్థికాభివృద్ధిలో కీలకమైన ఒక ప్రధాన భాగమని అన్నారు. పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాము లాంటిదన్నారు. నిరంతరం 24/7 ప్రజా సేవలో విధులు నిర్వర్తించే పోలీసులు తాము అందించే ఉత్తమ సేవలకు గుర్తింపుగా సేవా పతకాలను అంద చేయడం జరుగుతుందని, ఈ పతకాల స్పూర్తితో మరింత అంకిత భావంతో పనిచేయాలని పోలీసు అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారన్నారు.

అడిషనల్ డిజి అభిలాష బిస్త్ ఈ కార్యక్రమానికి స్వాగతం పలకగా, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ఎసిబి డిజి రవిగుప్త, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి రాజీవ్ రతన్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, అడిషనల్ డిజిలు విజయకుమార్, షిఖా గోయల్, స్వాతిలక్రా, సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర ఐజిలు కమలహాసన్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, షానవాజ్ కాసీం, రమేష్‌లతోపాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులు హాజరయ్యారు. మెడల్స్ గ్రహీతలను సైబరాబాద్ అడిషనల్ కమీషనర్ రితీ రాజ్ వేదికపై ఆహ్వానించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News