Monday, April 29, 2024

త్వరలో గిరిజనులకు పోడు పట్టాలు: ఇంద్రకరణ్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అడవుల సంరక్షణతోనే గిరిజనుల సమగ్రాభివృద్ధి ముడిపడి ఉందని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం భద్రాచలం లక్ష్మినగరం గ్రామంలో ఏర్పాటు చేసిన తునికాకు సేకరణదారులకు నికర ఆదాయ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అంతకుముందు హరితహార కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ అడవులనే నమ్ముకుని ఉన్న ఆదివాసుల జీవన సంస్కృతులను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. పోడు భూములకు ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైందని వెల్లడించారు. త్వరలోనే పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీకారం చుట్టనున్నారని చెప్పారు. అటవీ ఉత్పత్తులపై ఆధారపడే గిరిజనుల జీవనోపాధికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు.

తునికాకు సేకరించే కూలీలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తునికాకు సేకరణ చార్జీలతో పాటు రెవెన్యూ నెట్ షేర్ (బోనస్)ను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2016 నుంచి 2021 వరకు రూ. 200 కోట్లను బోనస్ (నెట్ రెవెన్యూ) చెల్లించామని తెలిపారు. బీడీ ఆకు సేకరణలో కట్టకు రూ.2.05 పైసల ఉంటే దానిని రూ.3కు పెంచామని తెలిపారు. లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే బోనస్ డబ్బులు జమ చేస్తున్నామని వెల్లడించారు. ఈ సీజన్‌లో 2.27 లక్షల స్టాండర్డ్ బ్యాగుల తునికాకును సేకరించి, విక్రయించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగ కాంతారావు,భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, పిసిసిఎఫ్ ఆర్‌ఎం డోబ్రియల్ , సిసిఎఫ్ భీమానాయక్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎస్‌పి డాక్టర్. జి. వినిత్, ఐటిడిఏ పీవో గౌతం, జిల్లా అటవీ అధికారి రంజిత్ , ఎఫ్డీవో మక్సుద్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News