Tuesday, April 30, 2024

నేటినుంచి టెన్త్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి నో

ఉదయం 9.30 నుంచి
మధ్యాహ్నం 12.45 గం.వరకు
పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా 2861
కేంద్రాలు 11,401 పాఠశాలల
నుంచి 5,34,903 మంది
పరీక్షార్థులు ఫోన్లకు అనుమతి
లేదు అక్రమాలకు పాల్పడితే
క్రిమినల్ కేసులు పరీక్షా
కేంద్రాల్లో సిసి కెమెరాలు
04023230942 నెంబర్‌తో
కంట్రోల్ రూం ఏర్పాటు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచి పరీక్షా హాలులోకి అనుమతిస్తారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. 5 నిమిషాల తర్వాత అంటే ఉదయం 9.35 గంటల తర్వాత వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పది పరీక్షలకు 11,401 పాఠశాలల నుంచి మొత్తం 5,34,903 మంది విద్యార్థులు హాజరవుతుండగా, అందులో 2,58,098 మంది బాలురు, 2,51,177 మంది బాలికలు హాజరు

రెండేళ్ల తర్వాత పరీక్షలు

రాష్ట్రంలో రెండేళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి.కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలు రాయకుండానే విద్యార్థులు పది ఉత్తీర్ణులు కాగా, ఈసారి కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తోంది. పదో తరగతిలో ఈసారి ఆరు పరీక్షలే ఉంటాయి. ఇప్పటివరకు ఆరు సబ్జెక్టులకు 11 పరీక్షలు జరుపుతుండగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరానికి వాటిని ఆరు పే పర్లకు కుదించారు. పరీక్ష సమయాన్ని 3.15 గంటలకు పెంచారు. సోమవారం జరుగనున్న తెలుగు, హిందీ, ఉర్దూ తమిళ్, కన్నడ, మరాఠి భా షా పరీక్షలకు 80 మార్కులకు ఒకే పేపర్ ఇవ్వనుండగా, కంపోజిట్ లాం గ్వేజెస్‌కు 60 మార్కులకు ఒక పేపర్, 20మార్కులకుమరో పేపర్ ఇవ్వనున్నారు.

పరీక్షా కేంద్రాల్లో ఫోన్లకి నో పర్మిషన్

పదో తరగతి పరీక్షలు జరిగే అన్ని పరీక్షా కేంద్రాలను అధికారులతో సహా ఎవరికీ ఫోన్లను అనుమతి ఉండదని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది. చీఫ్ సూపరింటెండెంట్లు సహా ఇన్విజిలేటర్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, నాన్ టీచింగ్, ఏఎన్‌ఎంలు, పోలీసు సిబ్బంది వంటి ఇతర శాఖల సిబ్బందికి మొబైల్ ఫోన్లకు అనుమతి ఉండదు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు సమయం చూసుకోవడానికి సాధారణ వాచ్ మినహా స్మార్ట్ వాచ్‌లు, డిజిటల్ వాచ్‌లు, కెమెరాలు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్లు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.

నోటీసు బోర్డు డిఇఒ, ఎంఇఒ నెంబర్లు

టెన్త్ పరీక్షా కేంద్రాల వద్ద అందరికీ కనిపించే విధంగా డిఇఒ, ఎంఇఒల ఫోన్ నెంబర్లు పెట్టనున్నారు. ఆయా పరీక్షా కేంద్రాలలో ఏమైనా అక్రమాలు జరిగినట్లు తెలిస్తే విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది ఎవరైనా ఆ నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు

పదవ తరగతి పరీక్షలలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై పబ్లిక్ పరీక్షల (మాల్ ప్రాక్టీస్ నివారణ) చట్టం 25/1997 కింద కేసులు నమోదు చేయనున్నారు. దుష్ప్రవర్తనకు పాల్పడిన వ్యక్తులందరిపై కఠినంగా కఠినంగా ఈ చట్టాన్ని అమలు చేస్తారు. చట్టంలోని నిబంధనలకు ప్రకారం అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

కంట్రోల్ రూమ్

టెన్త్ తరగతి పరీక్షలకు సంబంధించి ఎటువంటి సమస్యలు తలెత్తినా ఫోన్ చేసి సమాచారం అందించేందుకు వీలుగా ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో 040 23230942 నెంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. తెలిపారు.

పరీక్షా కేంద్రాలలో సిసి కెమెరాలు

ప్రతి పరీక్షా కేంద్రంలోని ఛీఫ్ సూపరింటెండెంట్ గదిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. అవసరమైనచోట అదనంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News