జష్పూర్: ఛత్తీస్గఢ్లోని జష్పూర్ జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో ఏనుగుల దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. టప్కారా అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు జరిపిన దాడిలో ఇగ్నేషియా టిగ్గా అనే 60 ఏళ్ల గిరిజన మహిళ మరణించగా కుంకు అటవీ ప్రాంతంలో బిట్నత్ రామ్ అనే 62 ఏళ్ల వ్యక్తిని ఏనుగులు తొక్కి చంపివేశాయి. పుట్టగొడుగులు సేకరించడానికి దైజీమహార్ గ్రామ సమీపాన ఉన్న ఆడవిలోకి వెళ్లిన టిగ్గాపై ఏనుగుల మంద దాడి జరిపినట్లు జష్పూర్ డివిజన్ డిఎఫ్ఓ శ్రీకృష్ణ జాదవ్ తెలిపారు.
తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు ఆయన చెప్పారు. అదే విధంగా తన కుమారుడితో కలిసి అడవిలోకి వెళ్లిన బిట్నత్కు ఏనుగుల గుంపు ఎదురైందని, ఆయన కుమారుడు తప్పించుకుని పారిపోగా బిట్నత్ మాత్రం ఏనుగుల దాడిలో అక్కడికక్కడే మరణించాడని డిఎఫ్ఓ తెలిపారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.25,000 అందచేసినట్లు ఆయన తెలిపారు.