Friday, May 3, 2024

యోగి పాలనలో పాపం పసివాళ్లు

- Advertisement -
- Advertisement -

సిద్ధార్థ్‌నగర్ : పది, పదిహేను ఏండ్ల పిల్లలు, ముక్కుపచ్చలారని బాల్యం. వీరు దొంగతనం చేశారని పట్టుకుని వీరితో మూత్రం తాగించారు. వీరి మర్మావయంలో మంటలు పుట్టేలా ఘాటు పచ్చిమిరపకాయలు ధట్టించారు. ఇంతటితో ఆగకుండా వీరికి గుర్తు తెలియని ఇంజెక్షన్లు ఇచ్చారు. ఇదీ ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో జరిగిన దారుణ ఘటన, పైగా ఈ మొత్తం రాక్షసకృత్యాన్ని సెల్‌ఫోన్ల ద్వారా చిత్రీకరించి, వీడియోలుగా ఆన్‌లైన్‌లో పెట్టారు. పసివాళ్లను దొంగలుగా చిత్రీకరించిన వారు సీసాలో మూత్రం పట్టి , వారితో తాగిస్తూ ఉండగా వారు ప్రతిఘటిస్తూ వారి నుంచి తప్పించుకోవాలని చూసినా వినలేదు.

వారిని విపరీతంగా కొడుతూ , పోరలై ఉండి డబ్బులు దొంగిలిస్తారని చెపుతూ తమ ఆటవిక న్యాయానికి దిగారు. పైగా ఈ ఇద్దరు బాబులను చేతులు కట్టేసి, వెల్లకిలా పడకోబెట్టి వారి దుస్తులు విప్పి , వెనుక మర్మభాగంలో పచ్చిమిర్చిలు జొప్పించారు. బాధతో తల్లడిల్లుతూ పెడబొబ్బలు పెడుతున్న వీరికి నెమ్మదిగా పసుపపచ్చ రంగులోని ఇంజెక్షన్లు ఇచ్చారు. ఆగస్టు 4న ఈ భయానక ఘటన చిత్రీకరించినట్లు వెల్లడైంది. జిల్లా కేంద్రంలోని కొంకటి చురాహా వద్ద ఉండే అర్షన్ చికెన్ దుకాణం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

పాత్రా బజార్ పోలీసు స్టేషన్ ఈ స్థలానికి సమీపంలోనే ఉంది. ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై తాము స్పందిస్తున్నట్లు , ఇద్దరు పిల్లల పట్ల జుగుప్సాకర చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంబంధిత సెక్షన్ల మేరకు , చట్టం పరిధిలో కేసులు పెట్టినట్లు వివరించారు. బాధ్యులను గుర్తించి వీరిలో ఆరుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా అదనపు ఎస్‌పి సిద్ధార్థ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News