కెవైసీ పేరుతో దోచుకున్న జాంతారా నిందితులు
ఇద్దరిని అరెస్టు చేసిన నగర సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్: కెవైసి, యూపిఐ పిన్ నంబర్ అప్డేట్ చేసుకోవాలని ఇద్దరు జాంతారా నిందితులను నగర సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్కు చెందిన గోవింద్ మండల్ మిగతా గ్యాంగ్తో కలిసి సైబర్ నేరాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నగరంలోని ట్రూప్ బజార్కు చెందిన వ్యక్తికి మే,17వ తేదీ, 2020లో 8345960166 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే మీ కెవైసీని అప్డేట్ చేసుకోవాలని చెప్పారు. తాము పంపించిన లింక్ ద్వారా చేసుకోవాలన్నారు. ఇది నిజమని నమ్మిన బాధితుడు లింక్ ఓపెన్ చేసి ఫోన్ నంబర్, యూపిఐ పిన్ ఎంటర్ చేసి రూ.1ని యాడ్ చేశాడు. తర్వాత మీకు కెవైసి వస్తుందని చెప్పాడు.
18వ తేదీన మళ్లీ ఫోన్ చేసి తాము ఎస్బిఐ నుంచి మాట్లాడుతున్నామని వెంటనే మీ యూపిఐ నంబర్ మార్చుకోవాలని లేకుంటే బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను కోల్పోతారని చెప్పారు. అనుమానం వచ్చిన బాధితుడు పిన్ నంబర్ను మార్చుకోలేదు. 19వ తేదీన వచ్చిన మెసేజ్లను చూడగా అందులో నాలుగు ఇన్స్టాల్మెంట్ల ద్వారా రూ.93,477 డ్రా చేసినట్లు వచ్చింది. వెంటనే బాధితుడు నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్స్పెక్టర్ ప్రశాంత్ నిందితుడిని అరెస్టు చేశారు. కాగా మరోకేసులో జార్ఖండ్, జాంతారాకు చెందిన మనోజ్దాస్ను అరెస్టు చేశారు. నిందితుడు నగరంలోని మురద్నగర్కు చెందిన బాధితుడికి 01,మే,2020లో ఫోన్ చేశాడు.
తాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారి రాహుల్రెడ్డిని మాట్లాడుతున్నానని చెప్పాడు. మీ ఎటిఎం కార్డు బ్లాక్ అయిందని విచారణ తర్వాతే బ్యాలెన్స్ వస్తుందని చెప్పాడు. తన బ్యాంక్ ఖాతాలో కేవలం రూ.1,000 మాత్రమే ఉన్నాయని చెప్పాడు. దీంతో సైబర్ నేరస్థుడు వేరే బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పాలని కోరాడు. తనకు ఉన్న హెచ్డిఎఫ్సి కార్డు నంబర్, సివివి నంబర్, ఓటిపి చెప్పాడు. దీంతో సైబర్ నేరస్థుడు 45,490 రూపాయలు గత ఏడాది మే1వ తేదీ, 2020లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. వెంటనే బాధితుడు ఎస్బిఐ ఉద్యోగిగా చెప్పుకున్న వ్యక్తికి ఫోన్ చేశాడు. కంగారు పడనక్కరలేదు, డబ్బులు తిరిగి జమ చేస్తామని తెలిపాడు. గూగుల్, ఫోన్ పే లింక్ మొబైల్ నంబర్ చేప్పాల్సిందిగా కోరాడు.
బాధితుడు ఫోన్ పేకు లింక్ ఉన్న మొబైల్ నంబర్ను చెప్పాడు. క్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాడు. దానిని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సైబర్ నిందితుడు చెప్పినట్లు చేయడంతో మళ్లీ రూ.45,000 దోచుకున్నారు. ఇలా మొత్తం రూ.89,490 ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. వెంటనే బాధితుడు నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఎసిపి కెవిఎం ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్స్స్పెక్టర్ ప్రశాంత్, ఎస్సై తిరుమలేష్ దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.