ఉద్ధవ్ సర్కార్పై ఫడ్నవీస్ వ్యాఖ్యలు
పుణె: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి(ఎంవిఎ) ప్రభుత్వాన్ని ”అసహజ పొత్తు”గా మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ అభివర్ణించారు. ఈ కూటమి విచ్ఛిన్నమైన రోజు మహారాష్ట్రలో బలమైన ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఆ రోజు వచ్చే వరకు తమ పార్టీ బలమైన ప్రతిపక్షంగా నిజాయితీతో పనిచేస్తుందని, రాష్ట్రంలో అధికార మార్పిడి కోసం తాము కాచుకుని కూర్చోలేదని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం షోలాపూర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటువంటి ప్రభుత్వాలు(శివసేన, ఎన్సిపి, కాంగ్రెస్తో కూడిన ఎంవిఎ వంటి కూటమి) దేశంలో ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయాయని, ఈ ప్రభుత్వం కూడా అందుకు మినహాయింపు కాదని వ్యాఖ్యానించారు. బిజెపి నేతృత్వంలోని గత ప్రభుత్వ కాలంలో పేరుకుపోయిన విద్యుత్ బిల్లుల బకాయిలపై విచారణ జరపాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ప్రస్తావిస్తూ విచారణ ప్రారంభమైన వెంటనే ప్రభుత్వం దానంతటదే పడిపోవడం ఖాయమని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.