Tuesday, April 30, 2024

కేసుల బ్యాక్‌లాగ్ పరిష్కారానికి తక్షణ చర్యలు అత్యవసరం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అన్ని స్థాయిలలో పెద్ద ఎత్తున పేరుకు పోయినపెండింగ్ కేసుల పరిష్కారానికే కాకుండా సత్వర న్యాయాన్ని కోరుకునే కక్షిదారుల ఆకాంక్షలను నెరవేర్చడానికి, కోర్టుల్లో ప్రొసీడింగ్స్‌ను ఆలస్యం చేసేందుకు అనుసరించే విధానాలకు అడ్డుకట్ట వేయడానికి అత్యవసరంగా చురుకైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. ఈ దిశగా పలు ఆదేశాలను కూడా జారీ చేసింది. సత్వర కేసుల పరిష్కారం కోసం సమన్లు అమలుచేయడం, లిఖిత పూర్వక ఫిర్యాదులను దాఖలు చేయడం, ఫిర్యాదులకు సంబంధించి వాది ప్రతివాదుల వాదనలను రికార్డు చేయడం, అభియోగాల నమోదు, విచారణకు తేదీలను ఖరారు చేయడానికి సంబంధించి అన్ని జిల్లా, తాలూకా స్థాయి కోర్టులకు ఎస్ రవీందర్ భట్ (ఇటీవలే పదవీ విరమణ చేశారు), జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.అంతేకాకుండా అయిదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న పాత కేసుల నిరంతర పర్యవేక్షణ కోసం సంబంధిత రాష్ట్రాల చీఫ్ జస్టిస్‌లు కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా బెంచ్ ఆదేశించింది.

సత్వర న్యాయం లభిస్తుందన్న ఆశతో లక్షలాది మంది కక్షిదారులు కేసులు ఫైల్ చేస్తుంటారని, అందువల్ల న్యాయ వ్యవస్థపై నమ్మకం చెదిరి పోకుండా చూడాలిన గురుతర బాధ్యతసంబంధిత భాగస్వాములపై ఉందని బెంచ్ తన ఉత్తర్వుల్లో అభిప్రాయపడింది. న్యాయాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా సమాజంలో శాంతి సుహృద్భావాలు, పౌరుల మధ్య సుహృద్భావ సంబంధాలను సాధించవచ్చని, చైతన్యవంతమైన న్యాయవ్యవస్థ కారణంగా దేశాభివృద్ధిని సైతం సాధించవచ్చని బెంచ్ సుదీర్ఘమైన తన ఉత్తర్వుల్లో అభిప్రాయపడింది. 43 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఓ కేసుకు సంబంధించి ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ యశ్‌పాల్ జైన్ అనే వ్యక్తి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై తీర్పు సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు తీర్పు ఉత్తర్వులను కొట్టివేసిన బెంచ్ ఆరు నెలల్లోగా పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News