విశాఖపట్నం: గ్యాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల పాలిమరైజేషన్ జరగటంతోనే విష వాయువులు వెలువడ్డాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కెజిహెచ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ పరామర్శించారు. ఈ ఘటనపై బాధితులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. ఎంజి పాలిమర్స్లో కంపెనీలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమైన విషయమని బాధను వ్యక్తం చేశారు. కలెక్టర్, సిపితో కూడిన కమిటీ ఏర్పాటు చేశామని రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రమాదం జరిగినప్పుడు అలారం మోగాల్సిందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఐదు అంబులెన్స్లు చేరుకున్నాయని, పోలీసులు కూడా త్వరగా చేరుకొని సహాయక చర్యలు చేపట్టారని తెలియజేశారు. వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న వారికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని, వైద్యం కోసం బాధితులెవరూ రూపాయి ఖర్చు చేయాల్సిన పని లేదని, బాధితులందరికి ప్రభుత్వమే చికిత్స చేయిస్తుందని, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తామన్నారు.
మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని జగన్ స్పష్టం చేశారు. ఎల్జి కంపెనీలో బాధిత కుటుంబాలకు ఉద్యోగాల కల్పిస్తామని, గ్రామాల్లో హెల్త్ క్యాంప్ల ఏర్పాటుకు కలెక్టర్ను ఆదేశించానన్నారు. గ్యాస్ ప్రభావం ఐదు గ్రామాలపై ఉందని, బాధిత గ్రామాల్లో 15 వేల మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు అందిస్తామని వెల్లడించారు. బాధితులందరికీ షెల్టర్, భోజన వసతి కల్పిస్తామన్నారు. రెండు రోజుల పాటు సిఎస్తో పాటు మంత్రులు కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారన్నారు. విశాఖపట్నంలో గ్యాస్ లీక్ కావడంతో పది మంది మృతి చెందారు. ఆస్పత్రుల్లో 350 మందికి పైగా చికిత్స పొందుతున్నట్టు సమాచారం.