Saturday, April 27, 2024

ఎపి వైపు వెళ్లే రైళ్లన్నీ ఫుల్..?

- Advertisement -
- Advertisement -

వెయిటింగ్ లిస్ట్‌కు కూడా అవకాశం లేదు…
మనతెలంగాణ/హైదరాబాద్:  వేసవి సెలవుల నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలో నడిచే రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. కనీసం వెయిటింగ్ లిస్ట్‌కు కూడా అవకాశం లేకుండా పోయింది. ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించడంతో రైళ్లలో సీట్లు రిజర్వేషన్‌లన్నీ నిండుకున్నాయి. సెలవులతో పాటు ఎపిలోనూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, మిగతా రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. రైల్వే రిజర్వేషన్‌లను 4 నెలల ముందుగానే బుక్ చేసుకునేలా రైల్వే శాఖ వెసులుబాటు కల్పించింది. దీంతో ముందుగా ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకోవడంతో రైళ్లన్నీ నిండిపోయాయి.

వేసవి సెలవులకు ప్రత్యేక రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎపికి వెళ్లే వందేభారత్ రైళ్లలో రోజువారీ టికెట్‌ల బుకింగ్ అధికంగా ఉంటోంది. వీటితో పాటు గోదావరి, జన్మభూమి, గరీబ్థ్,్ర కోణార్క్, ఫలక్‌నుమా, విశాఖ, మహబూబ్ నగర్, ఈస్ట్ కోస్, చెన్నై, ముంబై, బెంగళూరు నుంచి ఒడిశా వైపు వెళ్లే రైళ్లలో ప్రయాణించడానికి ఎపి ప్రాంత ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అదనపు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రధాన రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే కొన్ని ప్రత్యేక రైళ్లలో కనీస సౌకర్యాలు కూడా లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రత్యేక రైళ్లు వస్తాయా..?

సాధారణంగా సెలవుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారి సంఖ్యకు అనుగుణంగా రైళ్లు పెరగడం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేసవిలో అదనంగా మరో 10 నుంచి 20 రైళ్లు నడిపితే ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి రెగ్యులర్ రైళ్లు ఎక్కువగా ప్రయాణిస్తున్నాయి. అయితే అన్ని రైళ్లలో టిక్కెట్లు ముందుగానే ప్రయాణికులు బుక్ చేసుకోవడం విశేషం. స్పెషల్ రైళ్లలో అదనపు ఛార్జీలు వసూలు చేసినా పెద్దగా పట్టించుకోకుండా ముందుగానే తమ బెర్త్‌లను ప్రయాణికులు రిజర్వ్ చేసుకోవడం విశేషం. ప్రస్తుతం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ వరకు వెళ్లే రైళ్లన్నీ దాదాపుగా ఫుల్ అయిపోయాయి. వందేభారత్ రైళ్లలో కూడా బోగీలు పెంచారు. అందులో కూడా టిక్కెట్లను ముందుగానే రిజర్వ్ చేసుకున్నారు. వెయిటింగ్ లిస్ట్ నడుస్తుండటంతో రైళ్లలో వెళ్లాలనుకున్న వారు కొంత నిరాశ చెందుతున్నారు. అయితే ఈసారి కూడా ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News