Sunday, May 12, 2024

చేసింది మేమైతే… చెప్పుకునేది మీరా!?

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీశ్‌ రావు ఫైర్!

మన తెలంగాణ/హైదరాబాద్ : స్టాఫ్ నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమంపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. స్టాఫ్ నర్సుల ఉద్యోగ భర్తీ ప్రక్రియను బిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని చూస్తే ‘వంట అయినంక గరిటె తిప్పినట్లు’ ఉందంటూ సెటైర్లు వేశారు. అది తమ ప్రభుత్వ ఘనతగా నియామక పత్రాల జారీపై హడావుడి చేయడం దౌర్భాగ్యమన్నారు. ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, దాని నుంచి విద్యార్థుల దృష్టి మరల్చేందుకే ముందు రోజున స్టాఫ్ నర్సులకు నియామకపత్రాల జారీ కార్యక్రమాన్ని హంగు ఆర్బాటంతో నిర్వహిస్తోందన్నారు.

తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల నిర్మాణంతో పాటు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని బిఆర్‌ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది కొరత లేకుండా ఉండేందుకు మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది రిక్రూట్మెంట్ కు శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఇందులో భాగంగా 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేయగా, 2023 జూన్ 22న 1,890 పోస్టులను కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094కు పెరిగిందని తెలిపారు. 2023 ఆగస్టు 2న ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించి, తుది ఫలితాలు విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్ మొదలైందని, దీంతో తుది ఫలితాల విడుదలకు తాత్కాలిక ఆటంకం కలిగిందని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తూ, నియామక పత్రాలు ఇచ్చే పేరిట హడావుడి చేస్తూ, స్టాఫ్ నర్సు నోటిఫికేషన్ తమ ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నదని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం, ఏడాదిలోగా 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఆమోదించి, అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా, ఏడాది లోపే అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అలాగే గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియను వాటి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ పేరిట పత్రికల్లో ప్రకటనలు విడుదల చేసిందని గుర్తు చేశారు. చెప్పినట్లుగా ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్-1 నోటిఫికేషన్, అలాగే ఏప్రిల్ 1న గ్రూప్-2, జూన్ 1న గ్రూప్-3,-4 నియామకాలకు నోటిఫికేషన్, మార్చి1న పోలీసు సహా తరహా యూనిఫాం పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఎదురుచూస్తున్న ఉద్యోగ అభ్యర్థులకు, విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు.

స్టాఫ్ నర్సులుగా ఎంపికై బుధవారం నియామక పత్రాలు అందుకోబోతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. నర్సుల సేవలను గుర్తించి, వారి గౌరవాన్ని మరింత పెంచేలా వృత్తి పేరును ఉన్నతీకరించినట్లు వివరించారు. నర్సు పోస్టుల పేరును తమ ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వు జారీ చేసి ఉన్నతీకరించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా స్టాఫ్ నర్సులుగా పరిగణించడం శోచణీయమని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News