మంజీర పరివాహక ప్రాంతంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన వైనం
బోధన్రూరల్: బోధన్ మండల పరిధిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మండల పరిధిలో మందర్న మంజీర పరివాహక ప్రాంతంలో శవమై తేలిన వ్యక్తిని సాయిరాం(30)గా గుర్తించారు. బోధన్ ఎసిపి జైపాల్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళకు పదేళ్ల క్రితం కోటగిరి మండలం కొల్లూరు గ్రామానికి చెందిన సాయిరాంతో పెళ్లి జరిగింది. వీరికి ఆరేళ్ల కూతురు ఉంది. అయితే సాయిరాం భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో భర్త సాయిరాంను అడ్డు తొలగించుకునేందుకు ఆయన భార్య, ఆమె కుటుంబీకులు పథకం ప్రకారం శుక్రవారం అతడిని హత్యచేసి సమీపంలోని మంజీర పరివాహక ప్రాంతంలో పూడ్చిపెట్టారు.
సోమవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామస్తుల సమాచారం మేరకు ఘటన స్థలాన్ని పరిశీలించినట్టు ఎసిపి జైపాల్రెడ్డి తెలిపారు. సాయిరాం మృతదేహాన్ని వెలికితీసి బోధన్ తహసిల్దార్ గఫర్మియా సమక్షంలో శవపంచనామా నిర్వహించారు. అనంతరం సాయిరాం మృతదేహాన్ని అతడి తల్లికి అప్పగించారు. సాయిరాం తల్లి ఫిర్యాదు మేరకు అతడి భార్య, ఆమె కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు ఎసిపి వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఘటనాస్థలిని సందర్శించిన వారిలో ఎసిపితో పాటు బోధన్ రూరల్ సిఐ షాకీర్ అలీ, ఎస్ఐ అహ్మద్ తదితరులు ఉన్నారు.