Sunday, April 28, 2024

పురుషులకూ జాతీయ కమిషన్.. పిటిషన్ విచారణకు సుప్రీం నిరాకరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో పురుషుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పెళ్లైన మగవాళ్లలో బలవన్మరణాలు అధికంగా ఉంటున్నాయని, గృహహింసే దీనికి ప్రధాన కారణమని పిటిషనర్ చేసిన వాదనను పరిగణన లోకి తీసుకోడానికి నిరాకరించింది. న్యాయవాది మహేశ్ కుమార్ తివారీ దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, సభ్యులుగా ఉన్న ధర్మాసనం పరిశీలించి కీలక వ్యాఖ్యలు చేసింది.

“ మీరు నాణేనికి ఒకవైపు ఉన్న అంశాలనే చూపించాలనుకుంటున్నారా .. పెళ్లైన వెంటనే ప్రాణాలు కోల్పోతున్న యువతుల డేటాను ఇవ్వగలరా ? ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకోరు. ఆయా కేసులకు సంబంధించిన వాస్తవాలపై ఇది ఆధారపడి ఉంటుంది. ” అని సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్‌సిఆర్‌బీ 2021లో వెలువరించిన నివేదిక ప్రకారం ఆ ఏడాది దేశం మొత్తం మీద 1,64, 033 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో పురుషులు 1,18,979 కాగా, మహిళలు 45,026 మంది, మరో 28 మంది ఇతరులు ఉన్నారు. బలవన్మరణాలకు పాల్పడిన 1,18,979 మంది మగవాళ్లలో ప్ళ్ళైన వారు 81,068 మంది ఉన్నారు.

Also Read: తార్నాకలో బైక్‌ పైనుంచి దూకి లారీ కిందపడిన అమ్మాయి

ఆత్మహత్యలకు పాల్పడిన 45,026 మంది మహిళల్లో వివాహితులు 28, 680 మంది ఉన్నారు. పెళ్లైన మగవాళ్లలో 33.2 శాతం మంది ఆత్మహత్య కు కుటుంబ సమస్యలు కారణం కాగా, 4.8 శాతం మంది మృతికి వివాహ సంబంధిత వివాదాలు కారణమని పిటిషనర్ మహేశ్ కుమార్ తివారీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెళ్లైన మగవాళ్లలో ఆత్మహత్యలను నివారించడానికి గాను, గృహహింసపై పురుషులు ఇచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకునేలా జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఆదేశాలివ్వాలని పిటిషనర్ మహేశ్ కుమార్ తివారీ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు అధ్యయనం నిర్వహించి నివేదిక అందించడానికి లా కమిషన్‌ను ఆదేశించాలని కోరారు. ఈ నివేదిక ఆధారంగా పురుషుల కోసం జాతీయ కమిషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ విజ్ఞప్తి చేసినప్పటికీ సుప్రీంకోర్టు వీటిని పరిగణన లోకి తీసుకోడానికి నిరాకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News