Wednesday, May 1, 2024

వామపక్షాలు బోణీ కొట్టేనా?

- Advertisement -
- Advertisement -

(ఎల్. వెంకటేశం/మనతెలంగాణ): వామపక్షాలు అటు రాష్ట్రంలోనూ, ఇటు జిల్లాలోనూ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సిపిఎం గట్టి పట్టు ఉండి అనేకసార్లు గెలిచిన నకిరేకల్, మిర్యాలగూడ స్థానాలు కూడా గెలవలేని స్థితికి వచ్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 2009 వరకు జిల్లాలో ఎర్ర పార్టీలకు ఏదో ఒకచోట ఎమ్మెల్యే ఉండేవారు. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత అసలు అసెంబ్లీలోనే ఉనికి లేకుండా పోయింది. ఒకనాటి ఉద్యమ కేంద్రంలో ఒక్క సీటైనా గెలుచుకోవాలనే ఆరాటం కొనసాగుతోంది.

అయితే సిపిఎం పోటీతో లాభపడేది ఎవరు? నష్టపోయేది ఎవరు అంటూ చర్చలు సాగుతున్నాయి? 2009లో సింగిల్ మిర్యాలగూడ స్థానాన్ని గెలుచుకున్న సిపిఎం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓడిపోతూనే ఉంది. మూడు సార్లు గెలిచిన జూలకంటి రంగారెడ్డి తాజా ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రాష్ట్రంలో రెండో మూడు సీట్లైనా గెలచుకోవడానికి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సిపిఎం ప్రయత్నించింది. కానీ, అది సాధ్యం కాలేదు. ఇక సిపిఐ కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పొత్తుతో పోటీ చేస్తోంది. అక్కడి నుంచి ఎలాగైనా గెలవాలన్న తపనతో ముందుకెళుతోంది.

ప్రతి నియోజకవర్గంలో సిపిఎంకు 3వేల ఓట్లు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉండగా ఏడు నియోజకవర్గాల్లో సిపిఎం అభ్యర్థులు బరిలో దిగారు. మిర్యాలగూడ నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పోటీలో ఉంటే ఎవరికీ నష్టం అనే చర్చ జరుగుతోంది. పార్టీ బలహీనపడ్డా ప్రతి నియోజకవర్గంలో ఆ పార్టీకి కనీసం మూడు వేల ఓట్లయినా ఉంటాయి. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల్లో ఈ ఓట్ల చీలికతో ఏ పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయన్న చర్చల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒకనాడు కమ్యూనిస్టులు అసెంబ్లీలో ఉండేవారు.

వారిలో ఎక్కువ భాగం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చేవారు. రాను రాను వామపక్షాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారడంతో ఆ పార్టీ కేడర్‌లో అయోమయ పరిస్థితి నెలకొంది. మిర్యాలగూడలో గత ఎన్నికల్లో పోటీ చేసిన జూలకంటి రంగారెడ్డికి పదకొండు వేల ఓట్లు పోలయ్యాయి. ఈసారి ఆయన ఎన్ని ఓట్లు చీలుస్తారనేది కీలకంగా మారింది. ఇక్కడ బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. జూలకంటి రంగారెడ్డి ప్రధానంగా కార్మికులతో పాటు వ్యవసాయ కూలీల ఓట్లపైనే నమ్మకం పెట్టుకున్నారు. రంగారెడ్డి చీల్చే ఓట్లపైనే మిర్యాలగూడ ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

నకిరేకల్‌లో నర్రా ఆరుసార్లు విజయం
నకిరేకల్ నియోజకవర్గంలో సిపిఎం నేత నర్రా రాఘవరెడ్డి ఆరుసార్లు విజయం సాధించారు. ఆతర్వాత నోముల నర్సింహయ్య రెండుసార్లు గెలిచి తర్వాత గులాబీ పార్టీలో చేరి ఒకసారి విజయం సాధించారు. 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆ పార్టీ నామమాత్రంగా తయారైంది. ప్రస్తుతం అక్కడ బిఆర్‌ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ నుంచి వేముల వీరేశం పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచినా మూడు నుంచి ఐదు వేల ఓట్ల మధ్యనే మెజార్టీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సిపిఎం నేతలంతా బిఆర్‌ఎస్‌లోకి..
ఇక నల్లగొండ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థిగా నంద్యాల నర్సింహ్మారెడ్డి ఒకసారి గెలిచారు. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పోటీలో నిలుస్తున్నారు. పాత తిప్పర్తి మండలంలో జెడ్పీటిసి సభ్యుడిగా పనిచేసిన ఆయనకు మండలంతో పాటు నియోజకవర్గంలో కూడా మంచి పరిచయాలే ఉన్నాయి. తిప్పర్తి మండలం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. దీంతో ఆయన ఏమేరకు ఓట్లు చీలుస్తారన్నది కీలకంగా మారింది. గతంలో సిపిఎంలో పనిచేసిన నేతలం తా ప్రస్తుతం అధికార పార్టీలో చేరారు. మునుగోడులో సిపిఐకి మంచి పట్టుంది. కానీ, మొదటి నుంచి ఇక్కడ సిపిఐ అభ్యర్థికే సిపిఎం మద్దతు ఇస్తూ వస్తోంది. సిపిఐ పలుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించింది.

ప్రస్తుతం ఇక్కడ సిపి ఐ పోటీ చేయడం లేదు. కాంగ్రెస్‌తో ఉన్న పొత్తు కారణంగా హస్తం పార్టీ అభ్యర్థికే సిపిఐ మద్దతు ఇస్తుంది. అందువల్ల సిపిఎం ఒంటరిగా పోటీ చేస్తోంది. సిపిఎం నుంచి దోనూరి నర్సిరెడ్డి బరిలో ఉన్నా ఆయన ప్రభావం అంతంత మాత్రమేనని స్థానికులు పేర్కొంటున్నారు. మునుగోడు బిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య పోరు హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో సిపిఎం నుంచి పోటీ చేస్తున్న నర్సిరెడ్డి చీల్చే ఓట్లు కీలకం కానున్నాయి. ఇక భువనగిరి, హుజూర్ నగర్, కోదాడల్లో ఆ పార్టీ పోటీ చేస్తున్నా అక్కడ సిపిఎంకు చెప్పుకోదగ్గ బలం లేదు. అయినా మూడు నుంచి ఐదు వేల ఓట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News