హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో విద్యుత్ బిల్లులు ప్రతి నెల తప్పనిసరిగా చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. క్రమం తప్పితే సిఎం కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో పెండింగ్ విద్యుత్ బిల్లుల అంశంపై సిఎస్ బిఆర్కెఆర్ భవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ విద్యుత్ బకాయిల అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు నుంచి డిస్కంలకు రావాల్సిన బకాయిలపై చర్చించి ఒక వారంలో సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.
త్వరలో స్థానిక సంస్థలలో పేరుకుపోయిన పెండింగ్ విద్యుత్ బకాయిలపై సిఎం కెసిఆర్ విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని, సంబంధిత శాఖ అధికారులు పూర్తి వివరాలతో నివేదికను రూపొందించాలన్నారు. అలాగే పనిచేయని బోరుబావులకు సంబంధించిన విద్యుత్ బిల్లులు తదితర అంశాలపై గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, డిస్కం అధికారుల సంయుక్త బృందాలను తక్షణమే ఏర్పాటు చేసి పెండింగ్ అంశాలను పరిష్కరించాలన్నారు. కరెంట్ మీటర్ రీడింగ్ ప్రాతిపదికనే చార్జీలను వసూలు చేయాలని, నూటికి నూరు శాతం సమగ్రంగా ఉండాలన్నారు. ఒక నెల లోపల అవసరమైన చోట విద్యుత్ మీటర్లను బిగించాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, కమిషనర్ సత్యనారాయణ, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్రావు, డిస్కం సిఎండిలు రఘుమారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
will Pay Electricity bill every month: CS Somesh Kumar