Sunday, April 28, 2024

సింగరేణి బచావో

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కార్మికులు కదం తొక్కారు. సింగరేణి ప్రైవేటీకరణను నిరసిస్తూ శనివారం సింగరేణి వ్యాప్తంగా కార్మికులు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ‘మోడీ సింగరేణి అం టూ కార్మికులు గొంతులు పిక్కటిల్లేలా స్లోగన్లు చేశారు. రాష్ట్రంపై ప్రధాని కావాలనే వివక్ష చూపిస్తున్నారంటూ కార్మికులు కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఇచ్చిన పిలుపుమేరకు టిబిజికెఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహించా రు. ధర్నా కేంద్రాలకు కార్మికులు నల్ల బ్యాడ్జీలతో తరలివచ్చారు. కేంద్ర ప్ర భుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశా రు. సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న భూపాలపల్లి, కొత్తగూడెం, మం చిర్యాల, గోదావరిఖని, రామగుండం, మందమర్రి, నస్పూర్, ఇల్లందులో కార్మికుల ఆందోళనతో పరిసర ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి.

ఈ సందర్భంగా బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను కేంద్రం తక్షణమే నిలిపివేయాలని కార్మికులు పెద్దఎత్తున డిమాండ్ చేశారు. జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని సిసిసి కార్నర్ వద్ద మంచిర్యాల జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా చేశారు. ఈ మహాధర్నాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్, చె న్నూరు నియోజకవర్గం శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు బాల్క సుమ న్, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తోందని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లిలో నిర్వహించిన ధ ర్నాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం యత్నిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సింగరేణి ప్రైవేటికరణను కేంద్రం ఆపేంత వరకు ఉద్యమిస్తామన్నారు. పేదల పొట్టకొట్టి పెద్దలకు పంచడమే మోడీ విధానమని ఆయన విమర్శించారు. సి కొత్తగూడెంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, శసనసభ్యులు వనమా, సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్ తదితరులు నిరసన తెలిపారు.

పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని చౌరస్తాలో నిర్వహించిన మహాధర్నాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంఎల్‌ఎ కోరుకంటి చందర్‌తో పాటు టిబిజికెఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వని మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇచ్చిన మాట నిలుపుకోని ప్రధానికి రాష్ట్రంలో తిరిగే హక్కు లేదని నినాదాలు చేశారు. ఈ సందర్భఁగా మంత్రులు ఆయా కేంద్రాల్లో మాట్లాడుతూ కేంద్రం కక్ష కట్టిందని మండిపడ్డారు. ఇప్పటికే పలుమార్లు గనుల వేలం ప్రక్రియ ప్రయత్నం చేసిన ప్రైవేటు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఇవే గనులని నేరుగా సింగరేణికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర థర్మల్ పవర్ జనరేషన్ లో సింగరేణి పాత్ర అత్యంత కీలకమైనదని, దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు, గృహ అవసరాలకు 24 గంటల పాటు ఇస్తున్న నాణ్యమైన విద్యుత్ సరఫరాను అడ్డుకోవాలన్న దురాలోచనతోనే కేంద్రం సింగరేణిని నిర్వర్యం చేసేందుకు యత్నిస్తోందని విమర్శించారు. సింగరేణి ప్రైవేటీకరణపై ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే జంగ్ సైరన్ మోగిస్తామని మరో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని ఈ సందర్భంగా మంత్రులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News