Saturday, April 27, 2024

విశాఖ ఉక్కుకు బిఆర్‌ఎస్సే ఊపిరి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగు ప్రజల బలిదానాలకు ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి భారత రాష్ట్ర సమితికి మాత్రమే ఉందని ఆ పార్టీ ఎపి చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మూడు రోజుల విశాఖ పట్నం పర్యటన కోసం వెళ్ళిన ఆయనకు వైజాగ్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తోట చంద్రశేఖర్‌కి స్వాగతం పలికారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మిన్నంటింది. విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి వుడా పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గజమాలతో తోట చంద్ర శేఖర్‌ను సత్కరించారు. దారి పొడవునా గులాబీ జెండాలు రెపరెపలాడటం విశేషం. వివాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకోవడంలో తెలుగు ప్రజలు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయిందని, ఈ పరిరక్షణ ఉద్యమాన్ని కూడా ఆ స్థాయిలో నిలబెడతామని తోట చంద్ర శేఖర్ భరోసా ఇచ్చారు. ఎపి ఆస్తులను యధేచ్ఛగా కొల్లగొడుతుంటే రాష్రటంలోని పార్టీ నోరు మెదపడం లేదని, ఒకరితో ఒకరు పోటీ పడుతూ కేంద్ర ప్రభుత్వానికి సాగిలపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

కేంద్ర నిరంకుశ విధానాలను ఎదిరిచండంలో దేశం మొత్తానికి బిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఆదర్శంగా నిలిచారన్నారు. లక్షల కోట్ల ఆస్తులున్న స్టీల్ ప్లాంట్‌ను దక్కించుకోవడం ద్వారా వేల కోట్ల నష్టాల్లో ఉన్న టాటా స్టీల్స్ గట్టెక్కాలని చూస్తోందని , మరోవైపు తప్పుడు లెక్కలతో దొరికిపోయిన అదాని గ్రూప్ కూడా గంగవరం పోర్టుకి అనుబంధంగా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను దొడ్దిదారిన లాక్కోవాలని చూస్తోందని చంద్రశేఖర్ ఆరోపించారు. స్పష్టమైన సమాచారంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నామని , నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా ఈ అరాచకానికి అడ్డుకట్ట వేస్తామని వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు తోట చంద్ర శేఖర్ విశాఖలో పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు , కార్మికులతో పాటు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులతో తోట చంద్రశేఖర్ భేటీ కానున్నారు. ప్రవేటీకరణను అడ్డుకోడానికి అవసరమైన ప్రణాళికను సిద్దం చేస్తామని తద్వారా బలమైన ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని నిర్మిస్తామని తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

విశాఖ నా తల్లివేరు.. ఉన్నత విద్య ఇక్కడే పూర్తి చేశా, పిజి, పిహెచ్‌డి, ఐఎఎస్‌కి సెలక్ట్ అయ్యింది కూడా ఇక్కడి నుంచే, తనను ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్ళిన తల్లిలాంటి నా ఊరికి రావడం ఎంతో సంతోషంగా ఉంది, విభజన హామీల విషయంలో కేంద్రం ఘోరంగా వంచించింది, తొమ్మిదేళ్ళుగా ఒక్క విద్యా సంస్థను కూడా కేంద్రం పూర్తి చేయలేదు అని బిఆర్‌ఎస్ ఎపి చీఫ్ అన్నారు. పోలవరం నిధులు రాకపోయినా బేలగా ఎపి సిఎం మాట్లాడుతున్నారని, హక్కులను రాబట్టడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తాం అంటే సిఎం జగన్ ఎందుకు నోరెత్తడం లేదని నిలదీశారు. 39 మంది ఎంపిలు ఉండి ఎందుకు కేంద్రానికి సాగిల పడుతున్నారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్త అడ్డుకునే శక్తి మీకు లేదా, అయిదువేల కోట్లు ఇచ్యిచ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి ఎపి సర్కారుకు లేదా అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. గంగవరం పోర్టు ప్రైవేటీకరణలో పెద్ద కుంభకోణం దాగి ఉందని, రెండు వేల ఎకరాలను 400 కోట్లకు అదాని సంస్థకు ఇచ్చేశారని, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పై కన్నేశారని విమర్శించారు.

స్టీల్ ప్లాంట్ మొత్తం నష్టాలు 14 వేల కోట్లు అని అంతకంటే ఎక్కువ నష్టాల్లో ఉన్న ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌లకు అమ్మేస్తారా, ఇదేం దారుణం అని తోట నిలదీశారు. 1982 వరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో భాగంగా ఉందని, అప్పుడు ప్లాంట్‌కు ప్రత్యేకంగా గనులుండేవి, సెయిల్ నుంచి వేరు చేసేటప్పుడు గనులు ఇవ్వకపోవడం కూడ పెద్ద కుట్ర అని ఆయన ధ్వజమెత్తారు. దానివల్లే స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళిందన్నారు. నవరత్నం కంపెనీల్లో స్థానం దక్కించుకోవడం కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎంతో కష్టపడ్డారని, వారి శ్రమను నీళ్ళ పాలు చేస్తున్నట్లుగా ఈ సంస్థని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టేశారని అన్నారు. ఎపి రాజకీయ పార్టీలు బిజెపి స్వార్థానికి పావులవుతున్నాయని విమర్శించారు. దీనిపై జగన్, చంద్రబాబు ఎవరూ మాట్లాడరని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు తొమ్మిదేళ్ళలో ఇచ్చింది రూ.20 వేల కోట్లు మాత్రమేనని అయినా ప్రాజెక్ట ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పే పరిస్థితి లేదని అన్నారు. ఎపిలోని రాజకీయ నిస్తేజాన్ని చూసే బిఆర్‌ఎస్ గొంతెత్తిందని , కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై గొంతెత్తింది కెసిఆర్ అని అన్నారు. విభజన హామీల విషయంలో ఘోరంగా వంచించడాన్ని నిలదీశారన్నారు. ఇప్పుడు ప్రైవేటీకరణ విశాఖ స్టీల్ ప్లాంట్‌తోనే ఆగదని, అందుకే పోరాటానికి సిద్దమయ్యామని, నినాదాలకు పరిమితం కాబోమని పోరాట పంథాలో నడుస్తామని తోట అన్నారు.

చంద్రబాబు కంటే ఘోరంగా జగన్ మొడి ముందు మోకరిల్లారని అందుకే రాష్ట్రం ఘోరంగా నష్టపోతోందని తోట చంద్రశేఖర్ అన్నారు. ఎపిలో సమస్యలున్నా మాట్లాడకపోతే వైసిపికి అధికారం ఎందుకని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల ఘోరంగా ఉందని, మన ఆస్తులను అమ్మేసి ప్రైవేటీకరణ ముసుగువేస్తే వదిలేస్తామా అని అన్నారు. మా పోరాటం చిత్తశుద్ధితో సాగుతుందన్నారు. ఎపికి ఉన్న వనరులు మరే రాష్ట్రానికి లేవని, 26 నదులు ఉన్నాయని సారవంతమైన నేల, తీర ప్రాంతం, మంచి మానవ వనరులు ఉన్నా నాయకత్వ లోపం ఎపిని వేధిస్తోందన్నారు. తెలంగాణలో కెసిఆర్ సమర్థ నాయకత్వం వల్ల దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలిచిందన్నారు. తలసరి ఆదాయంలో నాగాలాండ్, మిజోరం కంటే తక్కువ ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఎపిని అభివృద్ధి పథంలో తేవాలంటే చిత్తశుద్దితో రాష్ట్రం కోసం పోరాడే నాయకులు కావలని బిజెపిని దేశంలో ఎదుర్కొనే శక్తి కెసిఆర్‌కి మాత్రమే ఉందన్నారు.

దేశానికి బిజెపి చేస్తున్న అన్యాయంపై కెసిఆర్ పోరాటమని, ప్రతిపక్షాలను రూపుమాపే కుట్రలను అడ్డుకోవడం కోసమే బిఆర్‌ఎస్ ఆవిర్భవించిందన్నారు. కెసిఆర్ స్థాయి నాయుకుడు దక్షిణ భారత దేశంలోనే లేడని, తెలుగు జాతికి ఆయనే నాయకుడని, పివి నరసింహారావు తర్వాత ప్రధాని కాగల అర్హత ఉన్న ఏకైక తెలుగు నేత కెసిఆర్ అని చంద్ర శేఖర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి స్పూర్తితో తెలుగు రాష్ట్రాలు పురోగమించాలన్నారు. తెన్నేటి విశ్వనాథం, అమృతరావు స్పూర్తితో ఉక్కు కర్మాగారాన్ని కాపడుకోవాలన్నారు. ప్రైవేటు పరం అయితే మనది అనే భవన పోతుందని, ఉద్యోగాలు, రిజర్వేషన్లు ఉండవని అన్నారు. గుజరాత్ నుంచి జనాన్ని దించినా మనమేమి చేయలేమన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం జిందాల్‌ని జగన్ తెచ్చాడని రైతు రాజ్యంగ కావాలనేది కెసిఆర్ ఆకాంక్ష అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News