మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కనిగిరి ఎంఎల్ఎ బుర్రా మధుసూదన్ యాదవ్ హల్ చల్ చేశారు. లాక్డౌన్ ఉల్లంఘిస్తూ బెంగుళూరు నుంచి ఐదు ఇన్నోవాలలో 39 మంది బంధువులతో వస్తున్న ఎంఎల్ఎ వాహనాలను కర్ణాటక, ఆంధ్రా బార్డర్లోని చీకలబైలు చెక్పోస్టు వద్ద చిత్తూరు జిల్లా పోలీసులు నిలువరించారు. లాక్డౌన్ ఉన్న కారణంగా కర్ణాటక నుంచి వచ్చే వారిని అనుమతించేదిలేదని తేల్చి చెప్పారు. దీంతో ఎంఎల్ఎ బుర్రా మధుసూదన్ యాదవ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీకి చెందిన ఎంఎల్ఎనని..తాను చెప్తే వినరా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో పోలీసులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిబంధనల మేరకు సరిహద్దు దాటి అనుమతించలేమని దీనిపై ఉన్నతాధికారులు తమకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతోనే అడ్డుకుంటున్నామని వివరించారు. ఈ అంశాన్ని మదనపల్లె డిఎస్పికి తెలియజేయడంతో ఆయన వచ్చి ఎంఎల్ఎ కు నచ్చజెప్పారు. అందరినీ క్వారంటైన్కు తరలిస్తామని డిఎస్పి చెప్పడంతో ఎంఎల్ఎ తన బంధువర్గంతో కర్ణాటకకు తిరుగు ప్రయాణమయ్యారు.
YCP MLA Burra Madhusudan Yadav Halchal at AP Border