Friday, May 3, 2024

మీరే తెలంగాణ భవిష్యత్ ! : మంత్రి నిరంజన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి వ్యవసాయం పట్ల మక్కువతో ఉద్యోగాలను సైతం వదిలి పంటల సాగుకు ముందుకు వస్తున్న యువతే ఈ రాష్ట్ర భవిష్యత్తు అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఎంటెక్ చేసి బొప్పాయి సాగు చేస్తున్నారని ,లండన్‌లో ఉద్యోగం వదిలి ఇక్కడ అవకాడో పండిస్తున్నారంటూ యువతను అభినందించారు.సోమవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో తనను కలిసిన రంగారెడ్డి జిలాలకు చెందిన యువకులను మంత్రి అభినందించారు. అందరికీ ఆదర్శంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల యువ రైతులు ముందుకు సాగుతున్నారని తెలిపారు.ఎంటెక్ చదివి 10 ఎకరాలలో బొప్పాయి, జామ, దొండ, వరి సాగు చేస్తున్న ఎంటెక్ చదివిన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అగర్ మియా గూడ యువరైతు అదీప్ అహ్మద్‌లను వెన్నతట్టి ప్రోత్సహించారు. మొజాయిక్ వైరస్ తో బొప్పాయి సాగుకు దూరమవుతున్న రైతులు దేశీ బొప్పాయి సాగుతో కేజీ రూ.30కి అమ్ముతూ 10 మందికి ఉపాధి కల్పిస్తున్న ఆదీప్ అహ్మద్ ఎందిరికో మార్గదర్శకం అన్నారు.

సివిల్ ఇంజనీరింగ్ చేసి లండన్ లో ఎంబీఏ చదివి ఉద్యోగం వదిలేసి ఎకరా 10 గుంటలలో అవకాడో పంట పండిస్తున్న కందుకూరు మండలం దెబ్బడగూడ తండా వాసి జైపాల్ నాయక్‌ను అభినందించారు. ఎకరాకు రూ.5 నుండి రూ.10 లక్షల వరకు లాభాలు తీస్తున్నారని , అవకాడో పంట సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నట్టు తెలిపారు. యూట్యూబ్ ద్వారా వ్యవసాయ విజయాలను ప్రపంచానికి తెలియజేస్తున్న కల్వకుర్తికి చెందిన వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థి శివకుమార్‌ను అభినందించారు. లక్ష మంది సబ్ స్క్రైబర్లతో విజయవంతంగా రైతుల విజయాల ప్రచారం చేస్తున్న మీలాంటి యువతే రేపటి తరానికి ఆదర్శం అని ప్రశంసించారు.

వ్యవసాయమే ఈ ప్రపంచ దిక్సూచి అని , వ్యవసాయ రంగం సుభిక్షంగా ఉంటేనే ఈ ప్రపంచం సురక్షితంగా ఉంటుందన్నారు. సాగుకు దూరమవుతున్న యువత మీలాంటి వారిని చూసి మళ్లీ వ్యవసాయాన్ని ప్రేమించాలని, మట్టి పరిమళాన్ని ఆస్వాదించాలని ఆకాంక్షించారు. సాగు మీద దృష్టి పెట్టి పంటల ఉత్పత్తిలో అద్భుతాలు సృష్టించాన్నారు. సమాజ ఆలోచనా విధానాన్ని సంపూర్ణంగా మార్చాలని, దానికి మీలాంటి వారే పునాదిరాళ్లు అన్నారు. మీ నేతృత్వంలో మరింతమందిని ఇటు వైపు మళ్లించాలి అని యువకులను మంత్రి నిరంజన్‌రెడ్డి అభినందించారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూలు జిల్లా జడ్పీ చైర్మన్ బాలాజీ సింగ్, రంగారెడ్డి జిల్లా ఉద్యాన అధికారి సునంద తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News