Saturday, May 4, 2024

మహిళా సంఘాలకు రూ. 11,750 కోట్ల బ్యాంకు లింకేజీ: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న ఆర్థిక సంవత్సరం (2022..20-23 )లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మూడు లక్షల పదివేల మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 11,750 కోట్ల బ్యాంకు లింకేజీ సెర్ప్ ద్వారా కల్పించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం మేరకు గత ఏడున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో 55 వేల 913 కోట్ల బ్యాంకు లింకేజీ ని గ్రామీణ ప్రాంతాలలోని మహిళ స్వయం సహాయక సంఘాలకు కల్పించామన్నారు. అధికారులు, సెర్ప్, ఉద్యోగుల కృషి వల్లనే ఇది సాధ్యమైందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మహిళ స్వయం సహాయక సంఘాల సభ్యులకు సహాయం అందించి తద్వారా ఉపాధి కల్పించడానికి సెర్ప్ ఉద్యోగులు అహర్నిశలు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి కోరారు.

గతంలో తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని, అదే విధంగా సెర్ప్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం చెల్లిస్తామని రెండు రోజుల క్రితం సిఎం కెసిఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో బుధవారం సెర్ప్ ఉద్యోగులు, గ్రామీణ ఉపాధి హామీ పథకం సంఘాల బాధ్యులు, ఉద్యోగులు మంత్రి ఎర్రబెల్లిని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చిన్న ఉద్యోగుల పట్ల సిఎం కెసిఆర్‌కు ఉన్న ఔదర్యానికి ఇది నిదర్శనమన్నారు. గత ప్రభుత్వాలు కేవలం ఉద్యోగుల సేవలను వినియోగించుకోవడమే తప్ప…వారి సంక్షేమం కోసం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో రూ.3,780 కోట్ల రూపాయల వ్యయం చేసి వివిధ అభివృద్ధి పనులు చేపట్టి 28 లక్షల కుటుంబాలకు చెందిన 48 లక్షల మంది కూలీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పని కల్పించామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 14 కోట్ల 64 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 14 కోట్ల 9 లక్షల పనిదినాలను కల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దిశా నిర్దేశంతో అధికారులు, ఉపాధి హామీ పథకం ఉద్యోగులు కష్టపడి పనిచేయడం వల్ల ఉపాధి హామీ పథకం అమలులో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో పని చేసి ఉపాధి హామీ పథకం రాష్ట్రంలో అమలు చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఎపిఒల సంఘము మోహన్ రావు, అంజిరెడ్డి, నాగభూషణం, ఇసిల సంఘం లింగయ్య, రాజశేఖర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ అకౌంట్స్ అసిస్టెంట్స్ సంఘం విజయ్ కుమార్, రఘు, రఫీ, టిఎల సంఘం వెంకట్రామిరెడ్డి, మాధవ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్‌ల సంఘం రవి, మొగిలి అటెండర్‌ల సంఘం అనంతయ్య, భిక్షపతి, స్వప్న సెర్ప్ ఉద్యోగుల సంఘం గంగిరెడ్డి, అశోక్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News