హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలో అత్యాధునిక పద్దతుల్లో చెత్త, నిర్మాణ వ్యర్థాల సేకరణ, తరలింపు ఉంటుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఖైరతాబాద్ హెచ్ఎండిఎం గ్రౌండ్లో నిర్మాణ వ్యర్థాలను తరలించే కంప్యాక్టర్ వాహనాలను, సంజీవయ్య పార్క్ దగ్గర నిర్మాణ వ్యర్థాల సేకరణ, ట్రాన్స్పోర్ట్ స్టేషన్ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో దేశంలోనే ముందున్నామని, త్వరలోనే 2700 ఆధునిక స్వచ్ఛ ఆటోలను తీసుకోస్తున్నామని, రెండు నెలల్లో ఓపెన్ టిప్పర్లు కనబడవన్నారు. ఒక్కో వాహనంలో 15 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలిస్తామని, చెత్త సేకరణతో పాటు తరలింపునకు అత్యాధునిక పద్ధతులు పాటిస్తామని స్పష్టం చేశారు. గతంలో చెత్త సేకరణ రెండు వేల ఆటోలను ప్రారంభించుకున్నామని, స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంక్లో హైదరాబాద్ దేశంలోనే ముందంజలో ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.