హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని దత్తాత్రేయనగర్లో బస్తీ దవాఖానను ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని, పేద ప్రజలు, బస్తీలో ఉండేవారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతమైందని, బస్తీ దవాఖానాలో అన్ని రకాల టెస్టులు చేస్తున్నామని వివరించారు. బస్తీ దవాఖానాలో మందులతో సహా అన్ని వసతులు అందుబాటులో ఉంచుతామని రాజేందర్ తెలియజేశారు. ఎలాంటి అవకతవకలు లేకుండా కట్టుదిట్టంగా నర్సింగ్ నియామకాలు జరుపుతున్నామన్నారు. అనేక కంపెనీల వ్యాక్సిన్లు ఇండియాకు వస్తున్నాయని, ముందుగా ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లకు, శానిటేషన్ సిబ్బందికి ఇస్తామన్నారు. బస్తీల్లో ఉన్న పేదలకు ఉచితంగా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.