మనతెలంగాణ/హైదరాబాద్ః వరంగల్లోని కమర్షియల్ టాక్స్ ఆఫీస్లో ఇద్దరు ఉద్యోగులు రెండు వేలు లంచం తీసుకుంటుండగా సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. వరంగల్ హంటర్ రోడ్డు లోని కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రహీం పాషా, టాక్స్ ఆఫీసర్ జ్యోతిలు యాకయ్య అనే వ్యక్తి నుంచి జిఎస్టి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ. 5 వేలు డిమాండ్ చేశారు. ఈక్రమంలో బేరసారాల అనంతరం యాకయ్య చివరకు రెండు వేలకు ఇచ్చేందుకు అంగీకరించారు. కాగా రెండు వేల రూపాయలు లంచం ఇవ్వడం ఇష్టం లేక యాకయ్య అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలో రూ.2 వేలు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఎసిబి అధికారులు ఇరువురిపై కేసు నమోదు చేసి ఎసిబి కోర్టులో హాజరుపర్చడంతో వారిని 14 రోజుల పాటు రిమాండ్కు తరలించారు.
2 Commercial tax employees in ACB net in Warangal