Sunday, April 28, 2024

రూ.2016 పెన్షన్ ఏ రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా?: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్నచోట పెన్షన్ 600 రూపాయలే
దేశంలో 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు, ఇందకు ఏటా 12 వేల కోట్లు
కొద్ది రోజుల్లో మరో 28 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి
డిఎస్సి సహా 9 వేల గ్రూప్ -4 ఉద్యోగాలకు అనుమతి
సంగారెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు కామెంట్స్

సంగారెడ్డి: భారత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం 2016 రూపాయల పెన్షన్ ఇవ్వడం లేదని, తెలంగాణలో సిఎం కెసిఆర్ మాత్రమే 2016 పెన్షన్ ఇస్తున్నారని ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.  గతాన్ని మనం గుర్తు చేసుకోవాలని, టిడిపి హయాంలో 75 రూపాయలు ఇచ్చేవారని, కొత్త పెన్షన్ అడిగితే ఊళ్లో ఎవరన్నా చనిపోతే ఆ పెన్షన్ మీకు ఇస్తామని చెప్పేవారన్నారు. కాంగ్రెస్ హయంలో 200 రూపాయల పెన్షన్ మాత్రమే ఇచ్చేవారని,  కాని తెలంగాణ వచ్చాక, సిఎం కెసిఆర్ మాకు అధికారం ఇస్తే 200 పెన్షన్ ను 1000 వేల రూపాయలు చేస్తామన్నారని, టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే 1000 రూపాయలు చేశామని, మళ్లీ అధికారం వస్తే 2016 రూపాయలు చేస్తమని కెసిఆర్ చెప్పిన మాట తప్పకుండా 1000 రూపాయల పెన్షన్ ను రూ. 2016 పెంచారని మెచ్చుకున్నారు.

సంగారెడ్డికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్, కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం కదా అక్కడ ఉన్నదని, కేంద్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం, కర్ణాటకలో బిజెపి ఉందని, కానీ అక్కడ ఇచ్చే పెన్షన్ కేవలం 600 రూపాయలు మాత్రమేనన్నారు.  57 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని కెసిఆర్ చెప్పారని, కాని కరోనా వల్ల కొంత జాప్యం జరిగిందన్నారు. ఇప్పుడు 57 ఏళ్ల వారికి పెన్షన్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు.  తెలంగాణ వచ్చాక సంగారెడ్డిలో లక్షా 5వేల పెన్షన్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు మరో 66 వేల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేశామన్నారు.  ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, ఎయిడ్స్ రోగులకు, బిడి కార్మికులు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం లేదని, కెసిఆర్ అందరికీ పెన్షన్లు ఇస్తున్నారని హరీష్ రావు ప్రశంసించారు.

కాంగ్రెస్ హయాంలో 25 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తే, తెలంగాణ వచ్చాక కెసిఆర్ 45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని,  ఏడాదికి రూ. 12 వేల కోట్లు, నెలకు రూ.1000 కోట్లు ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వ ఖర్చు చేస్తోందన్నారు.
పేదవాడికి పది కేజీల బియ్యం, 2016 పెన్షన్ ఇస్తుందని, వారు ఆత్మగౌరవంగా బతకడానకేనని,  కానీ బిజెపి ఉచితాలు అనుచితమని అంటోందన్నారు. బడా కంపెనీలకు బిజెపి 12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, రెక్కాడితే డొక్కాడని పేదలకు పెన్షన్లు ఇస్తే ఉచితాలు, అనుచితమని అంటోందని మండిపడ్డారు. బిజెపి ఏం చేసిందని ప్రశ్నించారు. నాలుగొందలున్న గ్యాస్ సిలిండర్ ధరను 1200 కు పెంచిందని, పెట్రోల్,డిజీల్ ధరలు పెంచిందని మోడీ ప్రభుత్వం విరుచుకపడ్డారు.  టిఆర్ఎస్ పేద ప్రజలకు పంచే కార్యక్రమం పెడితే, బిజెపి ప్రభుత్వం కార్పోరేట్లకు లక్షల కోట్లు పంచి పెడుతుందన్నారు.  కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల సాయం ప్రభుత్వం అందిస్తోందని, ప్రభుత్వ ఆసుపత్రులకు కాన్పుకెళ్తే 12 వేల రూపాయల సాయం, కెసిఆర్ కిట్, మంచి బోజనం పెట్టి, ఆటో కిరాయి ఇచ్చి ఇంటి దగ్గర దింపుతున్నామన్నారు. ఇలా సంగారెడ్డిలో ప్రతీ నెల ప్రభుత్వ ఆసుపత్రిలో 800 కాన్పులు జరుగుతున్నయని హరీష్ రావు కొనియాడారు.

రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, రైతు బీమాతో పాటు రెండు పంటలకు పది వేల రైతుబంధు కింద సాయం చేస్తున్నామన్నారు.  గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఇంతకు ముందే నోటిఫికేషన్లు ఇచ్చామని, ఇప్పుడు గ్రూప్-2, గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి అనుమతులిచ్చామన్నారు.  రాబోయే 2-3 రోజుల్లో 9 వేల గ్రూప్ -4 ఉద్యోగాలకు అనుమతి ఇవ్వనున్నామని,  91 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోందని వివరించారు. 52 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులిచ్చామని, రాబోయే కొద్ది రోజుల్లోనే మిగతా 28 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇస్తామని హరీష్ రావు వివరించారు. అందులో డిఎస్సి, గ్రూప్-4 ఉద్యోగాలు ఉన్నాయని, వందకు వంద శాతం ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.  లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని, 11 వేల కాంట్రాక్ట్ పోస్టులు భర్తీ చేస్తామని, మరో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. మొత్తం మీద 2 లక్షల 10 ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక  ఏం చేసిందని ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు దాదాపు 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతుందని ధ్వజమెత్తారు. బిజెపికి సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, అడిషనల్ కలెక్టర్ రాజహర్ష, జిల్లా పరిషత్ ఛైర్మన్ మంజు శ్రీ, జైపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, డిసిఎంఎస్ ఛైర్మన్ శివకుమార్, సిడిఎస్ ఛైర్మన్ బుచ్చి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News