Sunday, May 5, 2024

పెరిగిన పన్ను రాబడి

- Advertisement -
- Advertisement -

25% growth in GST in Telangana

జిఎస్‌టిలో 25%శాతం వృద్ధి నమోదు, కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి చోటు చేసుకొంది. మొదటి ఐదు నెలల్లో పన్నుల వసూళ్లలో 35 శాతం అంచనాలు అందుకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు వివరాలతో కూడిన నివేదికను కాగ్‌కు అందించింది. ఐదు నెలల్లో పన్నేతర ఆదాయం ద్వారా రూ.2,089 కోట్లు రాగా… కేంద్రం నుంచి 4,183 కోట్ల రూపాయలు వచ్చినట్లు నివేదికలో వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం పన్నుల రాబడుల్లో రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఐదు నెలల్లో రూ.1,06,900 కోట్ల అంచనాకు గాను, ఆగస్టు వరకు పన్నుల ద్వారా రాష్ట్రానికి 37,591 కోట్ల రూపాయలు వచ్చాయి.

ఈ మేరకు వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు అందించింది. ఆగస్టు నెలలో ప్రభుత్వానికి రూ.9,000 కోట్ల రూపాయల పన్నుఆదాయం వచ్చింది.ఐదు నెలల్లో పన్నేతర ఆదాయం ద్వారా రూ.2,089 కోట్లు రాగా… కేంద్రం నుంచి 4,183 కోట్ల రూపాయలు వచ్చాయి. 20,941 కోట్ల రూపాయలను రుణాల ద్వారా ప్రభుత్వం సమకూర్చుకొంది. మొత్తం అన్ని రకాలుగా 64,826 కోట్లు రాగా, అందులో 58,937 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. రెవెన్యూ వ్యయం 24,107 కోట్లు కాగా, వేతనాలకు 11,310 కోట్లు ఖర్చు చేసింది. వడ్డీ చెల్లింపులకు 6,775 కోట్లు, పెన్షన్లకు 5,351 కోట్లు, రాయతీకి 4,421 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.

6,971 కోట్ల రూపాయలు పెట్టుబడి వ్యయం అయింది.ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంచనాలను 13 శాతానికిపైగా చేరుకుంది. కరోనా రెండోదశ, లాక్‌డౌన్ ప్రభావంతో ఆదాయానికి భారీగా గండిపడింది. ఇప్పటివరకు రూ. 24 వేల 629కోట్ల ఆదాయం సమకూరగా, ప్రభుత్వం రూ. 33,038 కోట్లు ఖర్చుచేసింది. జూన్ నెలాఖరు వరకు రూ. 12 వేల 891కోట్ల అప్పు చేసింది.కరోనా రెండోదశ, లాక్‌డౌన్ ప్రభావం తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంపై గట్టిగానే పడింది. జూన్ నెలతో ముగిసిన తొలిత్రైమాసికంలో కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్-కాగ్ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఆదాయం అంచనాల్లో 13.98 శాతం చేరుకుంది. బడ్జెట్‌లో ఆదాయం అంచనా రూ. 1,76,126 కోట్లు కాగా, జూన్ నెలాఖరు వరకు రూ. 24,629 కోట్లు ఖజానాకు చేరింది.

అందులో పన్ను ఆదాయం రూ. 20,225 కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 903 కోట్లు, కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు రూ. 3,499 కోట్లుగా ఉన్నాయి. ఖజానాకు రూ. 5,878 కోట్లు .అమ్మకం పన్ను ఆదాయం అంచనాల్లో 22.18 శాతం చేరుకోవడం ద్వారా రూ. 5,878 కోట్లు ఖజానాకు చేరాయి. ఎక్సైజ్ రాబడి అంచనాల్లో 20.74 శాతం చేరుకోవటం ద్వారా రూ. 3,526 కోట్ల ఆదాయం వచ్చింది. జిఎస్టీ ద్వారా రూ. 6,640 కోట్లు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 1,668 కోట్ల ఆదాయం సమకూరింది.

కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటాగా రూ. 1,501 కోట్లు వచ్చాయి. ఏప్రిల్ నెలలో రూ. 7,618 కోట్ల ఆదాయం రాగా, మే నెలలో అది రూ. 5,579 కోట్లకు తగ్గింది. జూన్‌లో రూ. 7,027 కోట్ల రాబడి వచ్చింది. మొదటి త్రైమాసికంలో ప్రభుత్వం రూ. 12,891 కోట్ల రుణం తీసుకుంది. ఏప్రిల్‌లో రూ. 1,925కోట్లు, మేలో గరిష్టంగా రూ. 6,684కోట్లు, జూన్‌లో రూ. 4,281 కోట్ల అప్పు చేసింది. బడ్జెట్లో ప్రతిపాదించిన అప్పు రూ. 45,509 కోట్లు కాగా… ఇప్పటివరకు తీసుకున్న రుణం 28.32శాతానికి చేరింది. ఈ ఏడాది జూన్ వరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 33,038కోట్లు ఖర్చు చేసింది. బడ్జెట్లో ప్రతిపాదించిన రూ. 1,98,430 కోట్ల వ్యయంలో ఇది 16.65 శాతంగా ఉంది.

జిఎస్టీలో 25శాతం వృద్ధి నమోదు:

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ గణాంకాలను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 25శాతం ,ఎపిలో 21శాతం జిఎస్టి వసూళ్లు జరిగినట్టు కేంద్ర ఆర్ధిక శాఖ వెల్లడించింది.సెప్టెంబర్ నెల రాష్ట్రంలో జిఎస్టి వసూళ్లు 25 శాతం వృద్ది ఉన్నట్టు తెలిపింది. గతనెల తెలంగాణలో జిఎస్టి ఆదాయం రూ.1,17,010కోట్లు కాగా, ఇందులో సిజిఎస్టి కింద రూ.20,578కోట్లు, ఎస్జిఎస్టీ కింద రూ.26,767కోట్లు, ఐజిఎస్టి కింద రూ.60,911కోట్లు వసూలైనట్టు తెలిపింది. ఐజిఎస్టి నుంచి సిజిఎస్టి కింద రూ.28812కోట్లు , ఎస్జిఎస్టి రూ 24140 కోట్లు సర్ధుబాటు చేసింది. రెగ్యులర్ సెటిల్ మెంట్ తర్వాత కేంద్రం ఆదాయం కింద సిజిఎస్టి రూ.49390కోట్లు , రాష్ట్ర ఆదాయం కింద ఎస్జిఎస్టి రూ.50,907కోట్లు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన జిఎస్టి రాబడులను బేరీజు వేస్తే 23శాతం అదనంగా వచ్చినట్టు తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.2790కోట్లు రాగా, ఏడాది సెప్టెంబర్‌లో రూ.3494కోట్ల ఆదాయం వచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News