Tuesday, April 30, 2024

మున్సిపాలిటీల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానాలు

- Advertisement -
- Advertisement -

288 new Basti Dawakhana in municipalities

జిహెచ్‌ఎంసిలో విజయవంతంగా కావడంతో పట్టణాలకు విస్తరణ
జూన్ 2 వరకు రెండు దశల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయం
పట్టణ పేదలకు చేరువ కానున్న నాణ్యమైన వైద్య సేవలు..
టీ డయాగ్నొస్టిక్ సహకారంతో ఉచితంగా రోగనిర్ధారణ పరీక్షలు
అన్ని బస్తీ దవాఖానాల్లో శాంపిల్స్ సేకరణ
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడి
పట్టణాల్లో బస్తీ దవాఖానాలపై సమీక్ష
పాల్గొన్న మంత్రులు హరీశ్ రావు, కెటిఆర్
ఆరోగ్య సూచి ర్యాంకింగ్‌పై మంత్రి కెటిఆర్ హర్షం

హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో 288 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిహెచ్‌ఎంసిలో బస్తీ దవాఖానాలు విజయవంతం కావడంతో వీటిని పట్టణాలకూ విస్తరించాలని వైద్య ఆరోగ్యశాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో అన్ని మున్సిపాలిటీల్లో కొత్తగా మొత్తం 288 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. వచ్చే ఆరు నెలల్లో వీటిని అందుబాటులోకి తేవాలని లక్ష్యం ఏర్పాటు చేసుకున్నది. మంగళవారం ఎంసిహెచ్‌ఆర్‌డిలో వైద్యారోగ్య శాఖ, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా పట్టణాల్లో బస్తీ దవాఖానల ఏర్పాటుపై చర్చించాయి. ఈ సమీక్ష సమావేశంలో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, సిఎం ఒఎస్‌డి గంగాధర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, టిఎస్‌టిఎస్ వెంకటేశ్వర్ రావు, సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆలోచనతో జిహెచ్‌ఎంసి పరిధిలో ఏర్పాటు చేసిన 256 బస్తీ దవాఖానలు పట్టణ పేదలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాయని, ఇదే స్ఫూర్తితో 141 మున్సిపాలిటీల్లో మరో 288 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రెండు దశల్లో వచ్చే జూన్ 2 నాటికి వీటిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 544 బస్తీ దవాఖానలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ దిశగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనాభా సంఖ్య, వైద్య సేవల అందుబాటు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయా ప్రాంతాల్లో దవాఖానలు ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్ శాఖ మౌలిక సదుపాయాలను, ఆరోగ్య శాఖ వైద్య పరికరాలను సమకూర్చుతుందని చెప్పారు. టీ డయాగ్నొస్టిక్ సహకారంతో కొత్తగా ఏర్పాటు చేసే బస్తీ దవాఖానల్లో ఎక్కడిక్కడే శాంపిల్స్ సేకరణ ఉంటుందని అన్నారు. ఉచిత వైద్యం, ఉచిత మందులతో పాటు, రోగ నిర్ధారణ పరీక్షలకు చేసే ఖర్చు కూడా పేదలకు తప్పుతుందని మంత్రి చెప్పారు.

ఆరోగ్య శాఖకు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు

నీతి అయోగ్ ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానంలో నిలవడం పట్ల మంత్రి హరీశ్ రావుకు, ఆరోగ్య సిబ్బందికి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏడేళ్లలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనా దక్షత వల్ల ప్రభుత్వ వైద్య రంగం ముందుకు దూసుకువెళ్తుందని పేర్కొన్నారు. గతేడాది 4వ స్థానం నుండి.. ఈ ఏడాది 3వ స్థానానికి చేరడం అభినందనీయమన్నారు. వచ్చే ఏడాది ఆరోగ్య సూచిలో తెలంగాణ మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. బస్తీ దవాఖానల పనితీరు బాగుందని, తమ ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయాలని చాలా వినతులు వస్తున్నాయన్నారు. ఐటి శాఖ నుండి వైద్యారోగ్య శాఖకు అవసరమైన సాంకేతిక సమాచారం అందిస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News