Friday, April 26, 2024

3 నెలల చిన్నారికి 51 సార్లు వాతలు..

- Advertisement -
- Advertisement -

నిమోనియా తగ్గాలని అమానుషం… పాప మృతి

భోపాల్ : సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు మూఢ నమ్మకాల నుంచి బయటపడలేక పోతున్నారు. నాటు వైద్యం చేయించుకుంటూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ మూడు నెలల పసికందు… ఇలాంటి మూఢ నమ్మకానికి బలైంది. వ్యాధి తగ్గాలని ఆ లేత శరీరంపై 51 సార్లు ఇనుపరాడ్డుతో కాల్చి వాత పెట్టారు. దీంతో అభం శుభం తెలియని ఆ చిన్నారి పదిహేను రోజులు మృత్యువుతో పోరాడి ఓడి పోయింది. ఈ అమానుష సంఘటన మధ్యప్రదేశ్ లోని గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న షాదోల్ జిల్లాలో చోటు చేసుకుంది. షాదోల్ లోని సింగ్‌పుర్ కథౌటియా గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి రుచితా కోల్ నిమోనియా బారిన పడింది.

దీంతో పాపకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అయితే ఆమె తల్లిదండ్రులు మూఢ నమ్మకంతో ఆస్పత్రికి తీసుకెళ్లకుండా స్థానికంగా ఉండే మంత్రగాళ్లకు పాపను చూపించారు. అక్కడ వ్యాధి తగ్గాలంటూ చిన్నారి పొట్టపై కాలిన ఇనుపరాడ్డు తో 51 సార్లు వాతలు పెట్టారు. ఆ తర్వాత పాప పరిస్థితి మరింత దిగజారింది. ఓ వైపు కాలిన గాయాలు, మరోవైపు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో అప్పుడు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే 15 రోజులు గడిచిపోయింది. సరైన సమయంలో నిమోనియాకు చికిత్స అందక పోవడంతో ఇన్ఫెక్షన్ వ్యాపించి ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు పాపకు హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేశారు. శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆస్పత్రికి వెళ్లగా ఈ విషయం వెలుగు లోకి వచ్చింది.

దీంతో వెంటనే చర్యలు చేపట్టారు. ఖననం చేసిన పాప మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టంకు పంపారు. ఈ ఘటనపై షాదోల్ జిల్లా కలెక్టర్ వందన వేధ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాతలు పెట్టొద్దని స్థానిక అంగన్వాడీ కార్యకర్త చెప్పినా, ఆ పాప తల్లి పట్టించుకోలేదు. గిరిజన ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిమోనియాకు ఇలాంటి చికిత్సలు సర్వసాధారణమయ్యాయి. దీనిపై చర్యలు తీసుకుంటున్నాం” అని తెలిపారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News