లక్నో: తమ పార్టీ రాజ్యసభ అభ్యర్థికి ఐదుగురు బిఎస్పి ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఉత్తర్ ప్రదేశ్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చే నెలలో 10 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు జరుగనుండగా బిజెపికి చెందిన 8 మంది అభ్యర్థులతోసహా 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేనప్పటికీ బిఎస్పి తరఫున ఆ పార్టీ జాతీయ సమన్వయకర్త, బీహార్ ఇన్చార్జ్ రాంజీ గౌతమ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయనను ప్రతిపాదించిన 10 మంది బిఎస్పి ఎమ్మెల్యేలలో ఐదుగురు బుధవారం యుటర్న్ తీసుకున్నారు. తమ సంతకాలు ఫోర్జరీ చేశారని ఐదుగురు బిఎస్పి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సచివాలయానికి ఫిర్యాదు చేయడంతో వారు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. యుపిలో బిజెపికి ఉన్న బలాన్ని బట్టి ఆ పార్టీ తరఫున రాజ్యసభ స్థానాలకు పోటీ చేస్తున్న 8 మంది అభ్యర్థులు సునాయాశంగా గెలుపొందుతారు. బిజెపియేతర పార్టీల మద్దతుతో తమ అభ్యర్థి గెలుపొందగలడని బిఎస్పి ఆశలు పెట్టుకోగా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. యుపి నుంచి ఖాళీ అవుతున్న 10 రాజ్యసభ స్థానాలలో మూడు బిజెపి, నాలుగు సమాజ్వాది పార్టీ, రెండు బిఎస్పి, ఒకటి కాంగ్రెస్ చెందినవి.
5 BSP MLA’s Withdraw Support to Party’s RS Nominee