న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ పాసింజర్ విమాన సర్వీసుల రద్దును నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన సంస్థ డైరెక్టరేట్ జనరల్ బుధవారం ప్రకటించారు. అయితే అంశాల వారీగా ఎంపిక చేసిన రూట్లలో మాత్రం అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమాన సర్వీసులను మాత్రం అనుమతించనున్నట్లు డిజి తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది మార్చి 23 నుంచి దేశంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే వందే భారత్ మిషన్ పేరిట ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీసులను మే నుంచి నడుపుతున్నారు. అమెరికా, బ్రిటన్, యుఎఇ, భూటాన్, ఫ్రాన్స్తో సహా 18 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకున్న భారత ప్రభుత్వం ఆ దేశాల నుంచి విమాన సర్వీసుల రాకపోకలు ప్రారంభించింది. కాగా.. రద్దు కొనసాగింపు వల్ల అంతర్జాతీయ కార్గో కార్యకలాపాలకు ఎటువంటి విఘాతం ఏర్పడబోదని డిజి తెలిపారు.
International Flights ban till Nov 30th in India