ముంబయి: మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తి, కొండ చరియలు విరిగిపడిన సంఘటనలలో ఇప్పటివరకు 76 మంది మరణించగా, 38 మంది గాయపడ్డారు. మరో 59 మంది గల్లంతైనట్లు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శనివారం తెలిపారు. భారీ వర్షాలకు అత్యధికంగా రాయగఢ్ జిల్లా నష్టపోయింది. గురువారం తలియా గ్రామంలో కొండచరియలు విరిగిపడి 37 మంది మరణించగా ఇతర సంఘటనలలో మరో 10 మంది మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలలో దాదాపు 90 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పుణెలో విలేకరులకు పవార్ తెలిపారు. వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలలో రాయగడ్తోపాటు రత్నగిరి, కోల్హాపూర్ జిల్లాలు ఉన్నాయి. వర్షం తాకిడికి దెబ్బతిన్న జిల్లాలలో ఎన్డిఆర్ఎఫ్కు చెందిన 21బృందాలు సైన్యం, కోస్ట్ గార్డుకు చెందిన 14 బృందాలతొ కలసి సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయని పవార్ చెప్పారు.
76 killed in floods in Maharashtra