10 కార్పొరేషన్లు,110 మున్సిపాలిటీలు గులాబీ తోటలు
పరోక్ష పుర ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎదురులేని రీతిలో విజయవిహారం చేసింది. సోమవారం నాడు ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీలలో 110 చోట్ల చైర్పర్సన్ల పదవులను అవలీలగా దక్కించుకున్నది. అలాగే ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లు దాని వశమయ్యాయి. సోమవారం నాడు పోలింగ్ లెక్కింపు ఘట్టాలు పూర్తైన కరీంనగర్ కార్పొరేషన్ కూడా టిఆర్ఎస్ ఖాతాలో చేరినట్టే. అధికారికంగా రేపు మేయర్ ఎన్నిక నిర్వహించనున్న కరీంనగర్లో కార్పొరేషన్లో గల మొత్తం 60లోని 33 వార్డుల్లో టిఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు దాదాపు సోదిలోకైనా లేకుండా పోయాయి. రెండు పార్టీలు కలిసి కేవలం 6 మున్సిపాలిటీలను మాత్రమే గెలుచుకోగలిగాయి. కాంగ్రెస్కు నాలుగు, బిజెపికి రెండు దక్కాయి. మేడ్చల్, నేరేడుచర్ల చైర్పర్సన్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి.
హైదరాబాద్ : సోమవారం నాడు పరోక్ష ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీలలో 110, 9 కార్పొరేషన్లు అవలీలగా, సునాయాసంగా టిఆర్ఎస్ కైవసమయ్యాయి. సోమవారం నాడు ఓటింగ్ లెక్కింపు కూడా జరిగిన కరీంనగర్ కార్పొరేషన్పై కూడా టిఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. ఇక్కడ గల 60లో 33 వార్డులను గెలుచుకున్నది. రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్, బిజెపిలు కలిసి 6 మున్సిపాలిటీలను మాత్రమే దక్కించుకోగలిగాయి. కాంగ్రెస్ 4 మున్సిపాలిటీలు ( వడ్డేపల్లి, మనికొండ, తుర్కయాంజిల్, చందూర్) గెలుచుకోగా, కమలం పార్టీ 2 (మక్తల్, ఆమంగల్) మున్సిపాలిటీలను గెలుచుకున్నాయి. మజ్లిస్ పార్టీ 2 (జల్పల్లి, భైంసా) మున్సిపాలిటీలను దక్కించుకున్నాయి.
చౌటుప్పల్, నేరేడుచర్ల మున్సిపాలిటీలిలో కాంగ్రెస్, సిపిఎం, టిఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఒక దశలో అయితే పరిస్థితి అదుపుతప్పుతున్నట్లే కనిపించింది. పోలీసులు సకాలంలో జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పలువురు స్వతంత్య్ర అభ్యర్ధుల మద్దతుతో టిఆర్ఎస్ పార్టీ చాలా సునాయాసంగా చైర్ పర్సన్, మేయర్ పదవులను దక్కించుకుంది. కాంగ్రెస్, బిజెపిలకు చెందిన ఎంపిలు, శాసనసభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను సైతం టిఆర్ఎస్ దక్కించుకుంది. ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లను దక్కించుకోవాలని బిజెపి చివరి నిమిషం వరకు శతవిధాలుగా యత్నించింది. కానీ టిఆర్ఎస్కు పలువురు స్వతంత్య్ర అభ్యర్ధుల మద్దతు తెలపడంతో బిజెపి ఆశలు అడియాశలు అయ్యాయి.
దీంతో ఆ రెండు కార్పొరేషన్లు కూడా అధికార పార్టీలో చేరాయి. అలాగే కాంగ్రెస్కు దక్కుతుందనుకున్న ఆదిభట్ల, పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ ఛైర్మన్లు సైతం స్థానిక టిఆర్ఎస్ శాసనసభ్యుడు కిషన్ రెడ్డి ఎత్తుగడతో అధికార పార్టీ ఖాతాలోకి చేరాయి. ఆదిభట్ల మున్సిపాలిటికి సంబంధించి 14వ వార్డు సభ్యురాలు కొత్త హార్థిక కాంగ్రెస్ ను ంచి గెలిచి అనూహ్యంగా టిఆర్ఎస్లో చేరి ఛైర్మన్ పదవికి దక్కించుకుంది. అలాగే పెద్ద అంబర్ పేటలో నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు టిఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంతో ఆ మున్సిపాలిటీ ఛైర్మన్ గులాబీవశమైంది. కాగా మేడ్చల్, నేరేడుచర్ల మున్సిపాలిటీల చైర్మన్ల ఎంపికకు కోరం సంఖ్యకు అవసరమైన సభ్యులు లేకపోవడంతో మంగళవారం నాటికి వాయిదా పడింది. చౌటుప్పల్ ము న్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ గందరగోళంగా మారింది. ఇక్కడ టిఆర్ఎస్కు ఎనిమిది వార్డులు రాగా కాంగ్రెస్కు…5, బిజెపికి..3, సిపిఎంకు,..3 చొప్పున వార్డులను కైవసం చేసుకున్నాయి.
అయితే మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల సమయం వరకు సిపిఎంకు కాంగ్రెస్క మద్దతు ఇస్తుందని ఆశించారు. అయితే చివరి నిమిషంలో ఆ పార్టీ తన స్టాండు మార్చుకుని టిఆర్ఎస్ వైపు మొగ్గుచూపింది. ఫలితంగా సిపిఎం, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సిపిఎం కార్యకర్తలను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే సమయంలో మునుగోడు మాజీ ఎంఎల్ఎ టిఆర్ఎస్ కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
ఫలితంగా కాంగ్రెస్ కార్యకర్తలు, టిఆర్ఎస్ కౌన్సిలర్లు చొ క్కాలు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆవేశంతో రాజగోపాల్రెడ్డి కౌన్సిలర్ల ప్రమాణ పత్రాలను చించేశారు. స్థానిక ఎంఎల్ఎగా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ బలం ఆరుకు చేరింది. తమతో పొత్తు పెట్టుకుని టిఆర్ఎస్కు సిపిఎం మద్దతు తెలపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
నేరేడుచర్ల ఎన్నిక నేటికి వాయిదా
నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పంతం నెగ్గించుకుంది. రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్రావుకు నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేయడానికి ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఆదేశాలు ఇచ్చారు. నేరేడుచర్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాలను ఆయన రద్దు చేశారు. మొత్తం 15 వార్డులున్న నేరేడుచర్లలో టిఆర్ఎస్ 7, కాంగ్రెస్ 7, సిపిఎం 1 స్థానంలో విజయం సాధించాయి. ఇక్కడ కాంగ్రెస్, సిపిఎం కూటమిగా ఉన్నాయి. మొత్తం నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 19 మంది చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో పాల్గొంటారని రిటర్నింగ్ అధికారి జాబితాలో పేర్కొన్నారు. అయితే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రామచందర్రావు ఓటు పెట్టుకున్నా జాబితాలో లేకుండా పోయిం ది. టిఆర్ఎస్కు చెందిన ముగ్గురు సభ్యులు ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, ఎంఎల్సి బోడకంటి వెంకటేశ్వర్లు, ఎంఎల్ఎ శానంపూడి సైదిరెడ్డి ఎక్స్ అఫిషియోగా నమోదు చేసుకున్నారు.
కాంగ్రెస్ నుంచి ఎంపి ఉత్తమ్కుమార్రెడ్డి అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. అయితే తెలంగాణకు కేటాయించిన కాంగ్రెస్కు చెందిన రాజ్యసభ సభ్యుడు కెవిపి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా దరఖాస్తూ పెట్టుకున్నా ఓటు హక్కు కల్పించలేదని కాంగ్రెస్ ఆగ్ర హం వ్యక్త చేసింది. ఈమేరకు ఎన్నికల కమిషనర్ను ఉత్తమ్కుమార్రెడ్డి సంప్రదించారు. దీంతో ఎన్నికల సంఘం ఆయనకు ఓటు హక్కు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై టిఆర్ఎస్ ఎంఎల్ఎ సైదిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ను విరగ్గొట్టారు. చేతిలో ఉన్న పేపర్లను చించేశారు. ఈ సమయంలో ఉత్తమ్, సైదిరెడ్డిల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కెవిపికి ఓటు హక్కు క ల్పించడం పట్ల టిఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని కోరింది. తీవ్ర గం దరగోళం నేపథ్యంలో చైర్మన్ ఎన్నికను మంగళవారం వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
కాంగ్రెస్…బిజెపిల మధ్య కుదిరిన పొత్తు
చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్, బిజెపిలు పరసర్పం సహకరించుకున్నాయి. పొత్తు కుదుర్చుకున్నాయి. మణికొండ మున్సిపాలిటీ చై ర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వగా.. మక్తల్లో బిజెపికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. బిజెపి మద్దతుతో మణికొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.