త్రిసూర్(కేరళ): ఇల్లే బార్గా మారి..నల్లాలో నీళ్లు బదులు మద్యం ప్రవహిస్తే ఎలా ఉంటుంది? త్రిసూర్ పట్టణంలోని సాలమన్ అవెన్యూలో ఒక అపార్ట్మెంట్లో నివసించే 18 కుటుంబాలు ఈ రకమైన వింత అనుభవాన్ని ఇటీవల చవిచూశారు. ఆ అపార్ట్మెంట్కు చెందిన 18 ఫ్లాట్లలో నివసించే కుటుంబాలు మాత్రం నల్లాలలో మద్యం వస్తుంటే షాక్కు గురై వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదించారు. అసలేం జరిగిందంటే..ఆ అపార్ట్మెంట్ సమీపంలో రచన అనే బార్ ఒకప్పుడు ఉండేది. అక్రమంగా 6 వేల లీటర్ల మద్యాన్ని నిల్వ చేసినందుకు ఆ బార్ను ఎక్సయిజ్ అధికారులు మూసివేయించి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఆ మద్యాన్ని పారబోయాలని కోర్టు ఆదేశించింది. దాంతో ఎకయిజ్ సిబ్బంది ఆ అక్రమ మద్యాన్ని బార్ ఆవరణలో ఒక గుంత తవ్వి అందులో పారబోశారు. ఆ మద్యాన్ని వదిలించుకోవడానికి వారికి ఆరు గంటలు పట్టింది. అయితే సాలమన్ అవెన్యూ అపార్ట్మెంట్కు చెందిన బావి ఆ సమీపంలోనే ఉందని వారికి తెలియదు. ఈ గుంతలో పోసిన మద్యమంతా భూమిలో ఇంకిపోయి ఆ బావిలో ఊటలా చేరింది. బావి నీటిలో ఈ మద్యం మిక్సింగై అది కాస్తా వాటర్ ట్యాంకులోకి ఎక్కింది. ఇంకేముంది..నల్లా తిప్పిన వారికి నీటిలో మిక్సింగ్ అయిన మద్యం లభించింది. ఇప్పటికీ బావిలో ఊటలా ఉబుకుతున్న మద్యాన్ని ఎలా వదిలించుకోవాలో ఆ అపార్ట్మెంట్ వాసులకు అర్థం కావడం లేదు. తమకీ గతి పట్టించిన ఎక్సయిజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ వారంతా చాలకుడి మున్సిపల్ సెక్రటరీని, ఆరోగ్య శాఖను డిమాండు చేస్తున్నారు.