విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రంలో కేథరిన్, రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఈనెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేథరిన్ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ “దర్శకుడు క్రాంతిమాధవ్ నాకు సినిమా కథతో పాటు పాత్రల గురించి వివరించారు. కథ నాకు బాగా నచ్చింది. ఈ చిత్రంలోని ప్రతి పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇక సినిమాలోని స్మిత పాత్రలో నటించమని క్రాంతి మాధవ్ చెప్పడంతో వెంటనే ఓకే అన్నాను.
ఈ సినిమాలోని మిగిలిన ముగ్గురు హీరోయిన్లతో కలిసి నేను ఏ సన్నివేశంలోనూ నటించలేదు. ఈ చిత్రంలో బొగ్గు గనిలో అధికారిగా కనిపిస్తాను. సినిమాలోని నా సన్నివేశాలన్నీ చాలా సరదాగా సాగిపోతాయి. ఇక విజయ్, నాకు మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తాయి. ఇక మంచి పాత్రలను పోషించాలన్నదే నా లక్షం. అందరూ మెచ్చుకునేలా నా నటన ఉండాలని భావిస్తాను”అని అన్నారు.