బర్హంపూర్ (ఒడిశా): ఒడిశా లోని గంజాం జిల్లా గొలంతర వద్ద కరెంట్ తీగలు తగిలి బస్సు విద్యుదాఘాతానికి గురవ్వడంతో తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. ఆదివారం పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం జంగల్పాడు నుంచి చికరాడకు వెళ్తుండగా మండరాజ్పూర్ వద్ద 11 కెవి పవర్ ట్రాన్స్మిషన్ కరెంటు తీగలు తగలడంతో ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ఉన్నారు. వీరంతా సమీప గ్రామంలోని పెళ్లి కి వెళ్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. బస్సులో చిక్కుకున్న వారిని స్థానికులు వెలికి తీయ గలిగారు. తీవ్రంగా గాయపడిన వారిని బర్హంపూర్ లోని ఎంకెసిజి ఆస్పత్రిలో చేర్చారు.
ముఖ్యమంత్రి నవీన్పట్నాయక్ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల వంతున ఎక్స్గ్రేషియో ప్రకటించారు. గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందించాలని ఆదేశించారు. ఒడిశా రాష్ట్ర రవాణా మంత్రి పద్మనాభ బెహెరా దీనిపై దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విభ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బస్సుపై ఉన్న లగేజి కరెంటు తీగలకు తగలడం వల్లనే విద్యుదాఘాతానికి దారి తీసిందని డ్రైవర్ టూవీలర్కు దారి ఇవ్వడానికి ప్రయత్రించడంలో ఇరుకురోడ్డులో కరెంటు తీగలు తగిలాయని ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది.